చనిపోయిన బాలుడికి చికిత్స!

చనిపోయిన బాలుడికి చికిత్స!


మహబూబ్‌నగర్‌లో ఘటన

డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే మృతి చెందాడంటూ బాలుడి బంధువుల ఆందోళన


 

మహబూబ్‌నగర్ క్రైం : వైద్యుడిని దేవుడితో సమానంగా చూస్తారు. అలాంటి వైద్యులే ఓ బాలుడి ప్రాణాలతో చెలగాటమాడారు. చని పోయిన బాలుడికి చికిత్స చేస్తున్నామంటూ నమ్మబలికారు. చివరకు వ్యవహారం బెడిసికొట్టడంతో తెల్లమొఖం వేశారు. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని నవోదయ ఆస్పత్రిలో బుధవారం వెలుగుచూసింది. హన్వాడ మండలం రామన్నపల్లికి చెందిన ఆంజనేయులు తన కుమారుడు హరిప్రసాద్(1) జ్వరం, మూర్ఛతో ఇబ్బం ది పడుతున్నాడని సెప్టెంబర్ 21వ తేదీన నవోదయ ఆసుపత్రిలో చేర్పించారు.



తొమ్మిది రోజుల నుంచి చికిత్స చేస్తున్న వైద్యులు.. మీ బాబు ఆరోగ్యం క్షేమంగా ఉందని త్వరలో కోలుకుంటాడని చెబుతూ వచ్చారు. ఈ క్రమంలో ఆస్పత్రి యాజమాన్యం  రూ.92 వేలు ఫీజు రూపంలో వసూలు చేసింది.  ఉదయం 11 గంటల సమయంలో   బాబు చనిపోయాడని ఓసారి..  అత్యవసర చికిత్స చేస్తున్నామంటూ మూడు గంటల పాటు హైడ్రామా నడిపారు. అయితే, కోలుకున్న బాబుకు వెంటిలేటర్‌పై చికిత్స చేయడం ఏమిటని అనుమానం వచ్చిన బాలుడి తల్లిదండ్రులు.. వైద్యులను నిలదీస్తే వారు ‘చావు’కబురు చెప్పారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే తమ బాలుడు చనిపోయాడని ఆందోళనకు దిగారు.  వైద్యులపై చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

 

 వైద్యుల నిర్లక్ష్యం లేదు

 రామన్నపల్లికి చెందిన హరిప్రసాద్ కుమారుడు  9 రోజుల నుంచి మా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. జ్వరం, మూర్ఛ ఒకేసారి రావడంతో పరిస్థితి విషమించింది. దీంతో అతను అపస్మారక స్థితిలోకి వెళ్లి మృతి చెందాడు. ఇందులో నవోదయ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం లేదు.        

 - ఖలీద్, నవోదయ ఆసుపత్రి నిర్వాహకుడు

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top