హీరో కొత్త బైక్ వచ్చేసింది
హీరో మోటోకార్ప్ దేశీయ మార్కెట్లోకి తన సరి కొత్త బైక్ ను లాంచ్ చేసింది. పండుగ సీజన్ ముగిసే నాటికి మంచి అమ్మకాలను సాధించే లక్ష్యంతో 150సీసీ సామర్థ్యం ఉన్న హీరో అచీవర్ను రెండు వేరియంట్లలో సోమవారం విడుదల చేసింది. డ్రమ్ బ్రేక్ వేరియంట్ ధరను రూ. 62,800లుగాను, డిస్క్ బ్రేక్ వేరియంట్ ధరను రూ. 61,800గా కంపెనీ నిర్ణయించింది.
ప్రస్తుతం మార్కెట్లో అచీవర్ కు భారీ మార్పులు చేసి ఆకర్షణీయంగా విడుదల చేశారు. ఐ3ఎస్(ఇంటిగ్రేటెడ్ స్టార్ట్ అండ్ స్టాప్) టెక్నాలజీని పరిచేయడంతో పాటు, శక్తివంతమైన ఇంజన్ అమర్చారు. సుమారుగా 13.4బిహెచ్పి పవర్, 12.80ఎన్ఎమ్ గరిష్ట టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. మెయింటెన్స్ ఫ్రీ బ్యాటరీ, సైడ్ స్టాండ్ ఇండికేటర్, ఎయిర్ ఫిల్ర్, ట్యూబ్ లెస్ టైర్స్ లాంటి ఫీచర్స్ ఇందులో వున్నాయి. తన 70 మిలియన్ కస్టమర్ల కోసం స్పెషల్ ఎడిషన్ ను లిమిటెడ్ గా భారత్ లో లాంచ్ చేస్తున్నట్టు తెలిపింది. మూడు రంగుల్లో బేస్ వైట్ షేడ్ గ్రాఫిక్స్ తో బైక్ లవర్స్ ను ఆకట్టుకోనుందని కంపెనీ పేర్కొంది.
కాగా ప్రస్తుతం మార్కెట్లో ఉన్న అన్ని 150సీసీ సామర్థ్యం గల బైకులకు ప్రత్యక్షంగా పోటీనివ్వనుంది. ముఖ్యంగా హోండా యూనికార్న్ మరియు బజాజ్ పల్సర్ 150 మోడళ్లకు సవాల్ విసరనుంది.
కాగా 2016 పండుగ సీజన్లో హీరో మోటోకార్ప్ అమ్మకాలను పెంచుకునే లక్ష్యంతో శరవేగంతో మార్కెట్లో కి దూసుకొస్తోంది. ఈ నేపథ్యంలో త్వరలోనే బీఎస్ -4 కంప్లైంట్ బైక్ లను లాంచ్ చేయనున్నట్టు ప్రకటించింది. అలాగే కొన్ని నెలల్లో తనకొత్త ఉత్పత్తులను అర్జెంటీనా లోకూడా విడుదల చేయనున్నట్టు తెలిపింది.