విషాదాన్ని నింపిన తాడిపూడి రిజర్వాయర్ ఘటన


విజయనగరం : సాగునీటికి ప్రాణాదారమైన తాటిపూడి జలాశయం వద్ద నేటి ఉదయం చోటుచేసుకున్న ఘటన విషాదాన్ని మిగిల్చింది. జలాశయంలో గల్లంతైన మహిళ కోసం వెతుకుతూ వెళ్లిన హెడ్కానిస్టేబుల్ ఏరులో పడి ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు అగ్నిమాపక శాఖలో పనిచేస్తున్న హెడ్కానిస్టేబుల్ సింహాచలంగా పోలీసులు గుర్తించారు.  దీంతో ఆ కుటుంబంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. మరోవైపు గల్లంతైన మహిళ ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. విజయనగరం జిల్లాలోని మూడు మండలాలకు సాగునీటితో పాటు, విశాఖపట్నానికి తాగునీరు అందించడానికి ప్రధాన ఆధారంగా ఈ తాడిపూడి జలాశయం ఉంది. ఈ జలాశయానికి మొత్తం నాలుగు ప్రధాన గేట్లుండగా.. వాటిలో మొదటి గేటు శనివారం ఉదయం విరిగిపోయింది.

 

ఒక్కసారిగా పైనున్న నీళ్లన్నీ ఉధృతమైన ప్రవాహంతో కిందకు రావడంతో, కిందివైపు దుస్తులు ఉతుక్కుంటున్న ఇద్దరు మహిళలు ఆ నీటి ప్రవాహంలో కొట్టుకునిపోయారు. వారిలో ఒకరు ఆచూకీ కొన్ని గంటల తర్వాత లభ్యమవడంతో, గల్లంతైన మహిళ కోసం వెతకడం ప్రారంభించారు. జామి గోస్థని నదిలో గాలిస్తూ వెళ్లిన హెడ్కానిస్టేబుల్ ఏరులో పడి ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన ప్రజల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.  జలాశయ గేట్ల నిర్వహణ సరిగా లేదని ఎప్పటినుంచో ఆరోపణలు వస్తున్నాయి. ఒక్కసారిగా నీరు ముంచెత్తడంతో సమీప ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనలలో ఉన్నారు. వెంటనే అడ్డుకట్ట వేయకపోతే మొత్తం గ్రామాలన్నీ ముంపునకు గురవుతాయని చెబుతున్నారు. 

 
Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top