థానేలో భవనం కూలి నలుగురి మృతి
థానే: మహారాష్ట్రలో రెండు అంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో నలుగురు మృతిచెందినట్టు బుధవారం అధికారులు ప్రకటించారు. థానే జిల్లాలోని థాకూర్లిలో 'మాతృఛాయ' పేరుతో గల రెండు అంతస్తుల భవనం మంగళవారం రాత్రి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్స్, అగ్నిమాపక సిబ్బంది 12 అగ్నిమాపక శకటాలతో సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి.
శిధిలాల్లో చిక్కుకున్న 15మందిని ఇప్పటివరకు రక్షించినట్టు తెలిసింది. 30 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ భవనంలో కనీసం 20 కుటుంబాలు వరకు నివాసముంటున్నాయి. శిధిలావస్థకు చేరుకున్న ఈ భవనం ఇటీవల కురిసిన భారీవర్షాల ప్రభావం వల్లే
కూలిపోవడానికి కారణమని నిపుణులు చెబుతున్నారు.