తిరిగొచ్చిన రూ.1,274 కోట్లు
* రాష్ట్ర ఖాతాలో మళ్లీ జమ
* ఆర్బీఐకి కేంద్రం నుంచి లేఖ
సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: పట్టు వీడకుండా రాష్ట్ర సర్కారు చేసిన ప్రయత్నం ఫలించింది. బెవెరేజెస్ కార్పొరేషన్ నుంచి ఆదాయపు పన్ను శాఖ సీజ్ చేసిన రూ. 1274.21 కోట్లు తిరిగొచ్చాయి. ఎట్టకేలకు ఈ డబ్బును తిరిగి తెలంగాణ ప్రభుత్వ ఖాతాలో జమ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ సంయుక్త కార్యదర్శి రజత్ భార్గవ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ గవర్నర్కు లేఖ రాశారు. ఐటీ శాఖ చెల్లించిన ఎంట్రీలను తిరిగి వెనక్కి తీసుకోవాలని సంబంధిత అధికారులకు తక్షణమే ఆదేశాలు జారీ చేయాలని అందులో సూచించారు. ఏ రాష్ట్ర ప్రభుత్వ కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి నిధులు మళ్లించాలన్నా.. రాజ్యాంగబద్ధమైన, న్యాయపరమైన అంశాలన్నీ పరిశీలించి పాటించాల్సిన అవసరం తప్పనిసరిగా ఉంటుందని ఆర్బీఐకి సలహా ఇవ్వటం గమనార్హం.
గత జూన్ 27న తెలంగాణ బెవరేజేస్ కార్పొరేషన్ (టీఎస్బీసీఎల్) బకాయిల కింద సర్కారు ఖాతా నుంచి రూ.1,274 కోట్లు ఐటీ శాఖ ఆర్బీఐ నుంచి నేరుగా సీజ్ చేసిన విషయం తెలిసిందే. జప్తు చేసిన విధానం చెల్లుబాటు కాదని ఢిల్లీలోని న్యాయ నిపుణులు, ఐటీ కన్సల్టెంట్లు చెప్పడంతో ఐటీ శాఖ వెనక్కి తగ్గింది.