రాష్ట్ర బంద్‌లో పాల్గొంటాం

రాష్ట్ర బంద్‌లో పాల్గొంటాం - Sakshi


వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి

టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై రైతులకు నమ్మకం సన్నగిల్లుతోందని వ్యాఖ్య


 

హైదరాబాద్: రైతులు, ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేసేందుకు తమ పార్టీ ఎప్పుడూ ముందుంటుందని వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఒకేసారి రుణమాఫీని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వివిధ రాజకీయ పార్టీలతో కలిసి ఈ నెల 10న రాష్ట్ర బంద్‌లో వైఎస్సార్‌సీపీ పాల్గొంటుందని పేర్కొన్నారు. రైతులకు భరోసా కల్పించేందుకు గతంలో కామారెడ్డిలో పార్టీ ఆధ్వర్యంలో రైతుదీక్ష చేపట్టామని గుర్తు చేశారు. ఇప్పుడు రైతుల పక్షాన నిలిచి బంద్‌లో పాల్గొంటున్నట్లు చెప్పారు. రుణమాఫీని ఒకేసారి కాకుండా విడతలవారీగా చేయడం వల్ల టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై రైతులకు నమ్మకం సన్నగిల్లుతోందన్నారు. అసెంబ్లీలో రైతుల పక్షాన నిలిచి ప్రశ్నించిన వైఎస్సార్‌సీపీతో సహా ఇతర ప్రతిపక్షాల గొంతును ప్రభుత్వం నొక్కేసిందని మండిపడ్డారు.



గురువారం వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నాయకులు కె.శివకుమార్, బీష్వ రవీందర్‌లతో కలిసి పొంగులేటి విలేకరులతో మాట్లాడారు. గత ప్రభుత్వాల పాపాలే తమకు శాపాలుగా మారాయని టీఆర్‌ఎస్ ప్రభుత్వం, మంత్రులు పేర్కొనడం హాస్యాస్పదమన్నారు. ఎన్నికల సందర్భంగా, తర్వాత ఇచ్చిన హామీలు, వాగ్దానాలను పూర్తి చేయకపోవడం వల్లనే రైతు ఆత్మహత్యలు చోటుచేసుకుంటున్నాయన్నారు. వైఎస్ హయాంలో రైతు కుటుంబం యూనిట్‌గా గిట్టుబాటు ధరలు, ఉచిత విద్యుత్, ఇతర ప్రయోజనాలతోపాటు వారి పిల్లలకు ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం, ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య, ఆరోగ్య సేవలు అందించారని, 2004 ముందు వరకు జరిగిన ఆత్మహత్యలను అరికట్టగలిగారన్నారు. ప్రస్తుతం వైఎస్సార్ పథకాలకు తూట్లు పొడిచారని ధ్వజమెత్తారు.

 

 

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top