‘హోదా’ కోసం ఆగిన గుండె

‘హోదా’ కోసం ఆగిన గుండె - Sakshi


వైఎస్సార్‌సీపీ కార్యకర్త మృతి

అరకులోయ: ఏపీకి ప్రత్యేక హోదా వచ్చే పరిస్థితులు కనిపించకపోవడంతో గుండెలు ఆగిపోతూనే ఉన్నాయి. తాజాగా విశాఖ జిల్లా అరకులోయలో వైఎస్సార్‌సీపీ కార్యకర్త ప్రాణాలు విడిచాడు. అరకులోయలోని పద్మాపురం నివాసి కేత చంద్రశేఖర్(47) ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్‌సీపీ  శనివారం చేపట్టిన బంద్‌లో చురుగ్గా పాల్గొన్నాడు. సాయంత్రం ఇంటికి వెళ్లి ప్రత్యేక హోదా రాదేమోనని ఆందోళన చెందాడు.



అసలు హోదా వస్తుందో రాదో అంటూ మదనపడుతూ పడుకున్నాడని, అర్ధరాత్రి గుండెలో నొప్పిగా ఉందంటూ లేచి కూర్చున్నాడని చంద్రశేఖర్ భార్య అమ్మలు తెలిపారు. స్థానికుల సాయంతో వెంటనే అరకులోయ ఏరియా ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారని ఆమె కన్నీరుమున్నీరయ్యారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ప్రత్యేక హోదాకు అనుకూలంగా లేకపోవడంపై చంద్రశేఖర్ బాధపడేవాడని గ్రామస్తులు చెప్పారు.



చంద్రశేఖర్ పెయింటింగ్ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. అతడికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ముగ్గురు కుమారులున్నారు.  ఆదివారం చంద్రశేఖర్ మృతదేహం వద్ద వైఎస్సార్‌సీపీ నేతలు నివాళులర్పించారు. అంత్యక్రియలకు వివిధ పార్టీల నేతలు, కార్యకర్తలు, స్థానికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.  

 

పెయింటర్‌గా సుపరిచితుడు

చంద్రశేఖర్  వృత్తిరీత్యా ఈ ప్రాంతంలో పెయింటర్‌గా సుపరిచితుడు. సైన్ బోర్డులు రాయడమే కాకుండా చిత్రకారుడిగా మంచి పేరుంది. అందరూ పెయింటర్ చంద్రశేఖర్ అని పిలుస్తారు. తండ్రి రైల్వే రిటైర్డ్ ఉద్యోగి. తండ్రి ఉద్యోగ రీత్యా తూర్పుగోదావరి జిల్లా నుంచి ఈ ప్రాంతానికి వచ్చారు. చంద్రశేఖర్ స్థానిక గిరిజన మహిళను వివాహం చేసుకొని ఈ ప్రాంతంలోనే స్థిరపడ్డాడు. వైఎస్సార్‌సీపీ ఆవిర్భావం నుండి పార్టీలో చురుకైన కార్యకర్తగా పనిచేస్తున్నాడు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top