నేను యోగిని.. ఆ కేసులో ఇరికించారు: నటి

నేను యోగిని.. ఆ కేసులో ఇరికించారు: నటి - Sakshi


ముంబై: 1990వ దశకంలో కరణ్‌ అర్జున్‌, ఆషికీ అవారా వంటి సినిమాలతో బాలీవుడ్‌ను ఉర్రూతలూగించిన భామ మమతా కులకర్ణి.. ప్రస్తుతం నైరోబీలో ఉంటున్న ఈమె ముంబైలో ఇటీవల వెలుగుచూసిన అంతర్జాతయ డ్రగ్స్‌ రాకెట్‌లో నిందితురాలిగా వెలుగులోకి వచ్చింది. డ్రగ్స్ రాకెట్‌ నిందితుడు విక్కీ గోస్వామితో సహజీవనం చేస్తున్నట్టు భావిస్తున్న మమతా కులకుర్ణి తాజాగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన వివరాలు తెలిపింది.



ఒకప్పుడు అందాల శృంగార తారగా వెలుగొందిన తాను ఇప్పుడు యోగినిగా మారానని, తన ఆత్మకథను చదివితేనే.. తన ఇంటర్వ్యూ ఇచ్చేందుకు అంగీకరిస్తానని ఆమె తెలిపింది. నైరోబీలో ఉన్న ఆమె ఈమెయిల్‌ ద్వారా తన ఆత్మకథను పంపి.. ఆ తర్వాత ఇంటర్వ్యూ ఇచ్చింది. బాలీవుడ్‌లో టాప్‌-2 హీరోయిన్‌గా ఒక వెలుగు వెలుగుతున్నప్పుడే తనకు ఈ రంగం సరిపడదని అర్థమయిందని, ఆ తర్వాత తాను ఆధ్యాత్మికత వైపు మళ్లానని, కాపాలిలోని శ్రీ గగన్‌గిరి మహారాజ్‌ గురువు దగ్గర ఆథ్మాత్మిక దీక్ష తీసుకొని యోగినిగా మారినట్టు ఆమె తెలిపింది.



సినిమాల్లో రాణిస్తున్న సమయంలోనే మమతా కులకర్ణి డ్రగ్స్‌ మాఫియా నేరగాడు విక్కీ గోస్వామితో ప్రేమలో పడి.. అర్ధాంతరంగా దుబాయ్‌ వెళ్లిపోయింది. విక్కీ తన స్నేహితుడని, అతడు ప్రపంచం చూపిస్తానని తనను తీసుకెళ్లాడని, ప్రస్తుతం తాను ఒంటరిగా నైరోబీలోని ఓ అపార్ట్‌మెంటులో ఉంటూ యోగా, ధ్యానం ద్వారా పూర్తిగా ఆధ్యాత్మిక దీక్షలో గడుపుతున్నానని మమత చెప్పింది. ముంబై డ్రగ్స్‌ రాకెట్‌ కేసులో తన ప్రమేయం ఏమాత్రం లేదని, పోలీసులే కావాలని తనను ఈ కేసులో ఇరికిస్తున్నారని తెలిపింది.  తన ఆత్మకథ చదివితే తానేమిటో అందరికీ అర్థమవుతుందని, తనపై కేసులు కూడా తేలిపోతాయని ఆమె పేర్కొంది.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top