ఓవరాక్షన్ ఎక్కువ: కెప్టెన్సీకి స్మిత్ పనికిరాడు!!
మెల్బోర్న్: భావోద్వేగాలను సరిగ్గా నియంత్రించుకోలేని స్టీవ్ స్మిత్ ఆస్ట్రేలియా జట్టుకు సారథిగా సరితూగడని ఆ దేశ మాజీ స్పిన్నర్ కెర్రీ ఓకీఫ్ అభిప్రాయపడ్డాడు. భారత్తో టెస్టు సిరీస్ సందర్భంగా అతను చాలా సందర్భంగాల్లో అతిగా రియాక్ట్ అయ్యాడని చెప్పాడు. భారత్తో ప్రతిష్టాత్మకంగా జరిగిన తాజా నాలుగు టెస్టుల సిరీస్ను ఆస్ట్రేలియా 2-1తో చేజార్చుకున్న సంగతి తెలిసిందే. అనేక వివాదాలు కుదిపేసిన ఈ సిరీస్లో పలుసార్లు తాను భావోద్వేగాలను అదుపులో పెట్టుకోలేకపోయినందుకు స్మిత్ క్షమాపణలు చెప్పిన సంగతి తెలిసిందే. స్టీవ్ స్మిత్ ఆస్ట్రేలియా జట్టుకు చిత్తశుద్ధితో నాయకత్వం అందించాడని, కానీ ఒత్తిడితో కూడిన ఈ బాధ్యతను నిర్వర్తించే క్రమంలో అతను అతిగా భావోద్వేగాలకు లోనయ్యాడని ఓకీఫ్ అభిప్రాయపడ్డాడు.
’అతను ముందుండి నడిపించాడు. నాయకుడిగా ఉండేందుకు ప్రయత్నించాడు. కానీ, మన దేశ కెప్టెన్గా కొనసాగగలిగే భావోద్వేగ స్థిరత్వంలో అతనిలో ఉందా? అంటే లేదనే అనిపిస్తోంది. అతను బాగా భావోద్వేగాలకు, కోపతాపాలకు లోనవుతున్నాడు. మైదానంలో ప్రతి విషయానికి అతను అతిగా స్పందించడాన్ని మనం తాజాగా చూశాం’ అని లెగ్ స్పిన్నర్ ఓకీఫ్ చెప్పాడు. మురళీ విజయ్ విషయంలో పరుషమైన బూతుమాటలు ఉపయోగించడం, అతిగా కోపాన్నిప్రదర్శించడంలో స్మిత్ అస్థిర ధోరణి కనిపిస్తున్నదని విశ్లేషించాడు. ఓకీఫ్ ఆస్ట్రేలియా తరఫున 24 టెస్టులు ఆడి.. 53 వికెట్లు తీశాడు.
సంబంధిత వార్తలు