అతడి ఆచూకీ చెబితే లక్షలు ఇస్తాం!
న్యూయార్క్: భారత–అమెరికన్ దీప్ రాయ్ (39) అనే సిక్కు యువకుడిపై దాడి జరిగిన వారం రోజుల తర్వాత కాల్పులు జరిపిన అనుమానితుడి ఊహాచిత్రాలను కెంట్ పోలీసులు విడుదల చేశారు. శ్వేతజాతీయుడైన దుండగుడు ఆరు అడుగుల ఎత్తులో మధ్యస్తంగా ఉంటాడని, అతడి వయసు 35 నుంచి 40 ఏళ్లు ఉండే అవకాశముందని వెల్లడించారు.
దట్టమైన, నల్లటి కనుబొమలు.. గోధుమ రంగు కళ్లు కలిగివున్నాడని వివరించారు. డార్క్ కలర్ దుస్తులు ధరించి, ముఖానికి ముసుగు వేసుకొచ్చి కాల్పులకు పాల్పడినట్టు తెలిపారు. విద్వేషంతోనే దుండగుడు దాడికి పాల్పడ్డాడని నిర్ధారించారు. నిందితుడి ఆచూకీ తెలిస్తే చెప్పాలని స్థానికులకు అర్బన్ సీటెల్, ఎఫ్ బీఐ అధికారులు విజ్ఞప్తి చేశారు. నిందితుడి గురించి చెప్పిన వారికి దాదాపు రూ. 4 లక్షలు(6 వేల డాలర్లు) నగదు ప్రోత్సాహకం ఇస్తామని ప్రకటించారు.
శుక్రవారం అర్ధరాత్రి ఇంటిముందు కారు వద్ద నిలబడ్డ దీప్ రాయ్ దగ్గరకు వచ్చిన ఆగంతకుడు ‘మీ దేశానికి వెళ్లిపోండి’ అని అరుస్తూ కాల్పులు జరిపాడు. భుజంలోకి బుల్లెట్ దూసుకెళ్లడంతో దీప్ రాయ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అంతకు ముందు కాన్సస్లో శ్రీనివాస్ కూచిభొట్ల, దక్షిణ కరోలినాలో హర్నీశ్ పటేల్పై జాత్యంహకార దాడులు జరిగాయి.
మీ దేశానికి వెళ్లిపోండి..
అమెరికాలోని మనవారిపై మరో విద్వేషపు పడగ!
మరో విద్వేషపు తూటా!
‘కాలుస్తుంటే ఏదో ఒకటి చేయాలనిపించింది’