అది సుప్రీంకోర్టు ఘనతే: శివసేన
ముంబై: నల్లకుబేరుల పేర్లను బయటపెట్టించిన ఘనత సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకే దక్కుతుందని శివసేన పేర్కొంది. 2014 సాధారణ ఎన్నికల్లో నల్లధనమే ప్రధాన అంశమని తెలిపింది. విదేశాల్లో దాచిన నల్లధనాన్ని వెనక్కు తీసుకురావడం ఎంత కష్టమో ఎన్డీఏ సర్కారు అర్థంకాలేదని తమ పార్టీ పత్రిక 'సామ్నా' సంపాదకీయంలో పేర్కొంది.
సుప్రీంకోర్టు జోక్యంతోనే కేంద్ర ప్రభుత్వం ముగ్గురు నల్లకుబేరుల పేర్లు బయటపెట్టిందని వ్యాఖ్యానించింది. అయితే ముగ్గురు పేర్లను మాత్రమే వెల్లడించడాన్ని శివసేన తప్పుబట్టింది. విదేశీ ఖతాల్లో మూల్గుతున్న మొత్తం నల్లధనాన్ని వెలికితీయాలని డిమాండ్ చేసింది. కాగా, సుప్రీంకోర్టు ఆదేశాలతో 627 మంది నల్లకుబేరుల పేర్లను కేంద్రం బుధవారం వెల్లడించింది.