‘బాహుబలి’ దెబ్బకు మరో వికెట్!
న్యూఢిల్లీ: భారీ అంచనాలతో ఘనంగా విడుదలైన ‘బాహుబలి-2’ సినిమా దెబ్బకు మరో వికెట్ పడింది. ఇప్పటికే రికార్డు మోత మోగిస్తున్న ఈ సినిమా దెబ్బతో ఢిల్లీలోని ప్రఖ్యాత షీలా థియేటర్ ప్రస్థానం ముగిసిపోయింది. 56 ఏళ్ల కిందట ఏర్పాటైన ఈ చారిత్రక సింగిల్ స్క్రీన్ థియేటర్ శుక్రవారంతో మూతపడింది. ఇప్పటికే ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న ఈ థియేటర్కు ‘బాహుబలి-2’ సినిమా ప్రదర్శన హక్కులు దక్కలేదు. ‘బాహుబలి’ దెబ్బకు మరో వికెట్!!దీంతో థియేటర్ మూతపడాల్సిన పరిస్థితి వచ్చింది.
తొలిరోజు అత్యధిక వసూళ్లు సాధించి ‘బాహుబలి-2’ చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రదర్శన హక్కులు లభిస్తే కొన్నిరోజులైన తాత్కాలికంగా థియేటర్ నిలబడేదని ‘షీలా సినిమా’ థియేటర్ యాజమాని ఉదయ్ కౌషిక్ పీటిఐకి తెలిపారు. ‘నిన్నటినుంచి మేం థియేటర్ నుంచి మూసివేశాం. గతకొన్నాళ్లుగా నష్టాలు వస్తుండటంతో థియేటర్ను నడిపించడం కష్టంగా మారింది. ‘బాహుబలి-2’ ప్రదర్శన హక్కులు లభించి ఉంటే కొంతకాలం థియేటర్ మనుగడ కొనసాగేది.
కొంతమేరకు లాభాలు వచ్చేది. దీంతో తాత్కాలికంగా థియేటర్ను మూసివేసే పరిస్థితి ఆగేది’ అని కౌషిక్ చెప్పారు. అయితే, గతకొంతకాలంగా థియేటర్ను మూసివేయాలన్న ఆలోచన ఉందని, బాహుబలి హక్కులు లభించినా.. ఆ తర్వాత కొంతకాలానికైనా థియేటర్ మూతపడటం తప్పకపోయేదని తెలిపారు. ఢిల్లీలో మొత్తం 65 థియేటర్లకు బాహుబలి ప్రదర్శన హక్కులు దక్కలేదు. అందులో ఒకటైన షీలా చారిత్రకంగా పేరొందిన థియేటర్ కావడం గమనార్హం. ఇప్పటికే ఢిల్లీలో ప్రముఖ రీగల్ థియేటర్ మూతపడిన సంగతి తెలిసిందే.