ఆమె కలెక్టర్ అయినప్పటి నుంచీ వెంటాడి..
న్యూఢిల్లీ: ఆమె జిల్లా కలెక్టర్గా పనిచేసినప్పటి నుంచి వెంటాడాడు. ఢిల్లీకి బదిలీ అయినా విడిచిపెట్టలేదు. ప్రస్తుతం ఆమె ఓ కేంద్ర మంత్రికి కార్యదర్శిగా పనిచేస్తోంది. అయినాకూడా ఏమాత్రం బెరుకు లేకుండా ఏకంగా నార్త్ బ్లాక్ కార్యాలయానికే ఫోన్లు చేసి వేధించేవాడు. అసభ్యకర మెసేజ్ లు, ఈ మెయిల్స్కు లెక్కేలేదు. చివరికి.. దారికి రాకుంటే యాసిడ్ పోస్తానని, కూతురిని చంపేస్తానని వాడు బెదిరించాడు. దీంతో బెంబేలెత్తిపోయిన ఆ ఐఏఎస్ అధికారిణి పోలీసులను ఆశ్రయించింది. దేశరాజధానిలో సంచలనం రేపిన ఈ ఘటనలో పోలీసులు శనివారం నిందితుణ్ని అరెస్ట్ చేశారు. పోలీసులు చెప్పిన వివరాలిలా ఉన్నాయి.
ప్రస్తుత కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశకర్ ప్రసాద్ కు కార్యదర్శిగా పనిచేస్తోన్న సీనియర్ మహిళా ఐఏఎస్ అధికారిణి గడిచిన మూడేళ్లుగా వేధింపులకు గురవుతోంది. ఆమె బిహార్ లోని ఓ జిల్లాకు కలెక్టర్ గా పనిచేసిన సమయంలో ఓ వ్యక్తి ఆమెకు పరిచయం అయ్యాడు. అప్పట్లోనే తరచూ వేధింపులకు పాల్పడేవాడు. ఆమె ఢిల్లీకి ట్రాన్స్ ఫర్ అయిన తర్వాత కూడా వేధించడం మానలేదు. పలు సందర్భాల్లో ఐఏఎస్ అధికారిణిపైన, ఆమె మూడేళ్ల కూతురిపైనా దాడి చేశాడు. బాధితురాలి ఫిర్యాదుమేరకు ఐపీసీ సెక్షన్ 354డీ, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు శనివారం నిందితుణ్ని అరెస్ట్ చేశారు.
కాగా, నిందితుడు కూడా సదరు ఏఎస్ అధికారిణిపై ఫిర్యాదు చేయడం గమనార్హం. ఆ అధికారిణి తన భార్య అని, చాలా కాలంగా ఇద్దరి మధ్యా గొడవలు జరుగుతున్నాయని, పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్న తనపై తప్పుడుకేసులు బనాయించిందని అతను ఆరోపిస్తున్నాడు. సమగ్ర దర్యాప్తు తర్వాత అసలు విషయాలు వెల్లడవుతాయని పోలీసులు పేర్కొన్నారు.