సీపీఐ సీనియర్‌ నాయకుడు రామశర్మ మృతి

సీపీఐ సీనియర్‌ నాయకుడు రామశర్మ మృతి


- గొప్ప యోధుణ్ని కోల్పోయామంటూ వైఎస్ జగన్ నివాళి



సాక్షి, హైదరాబాద్ :
సీపీఐ సీనియర్‌ నాయకులు, మాజీ ఎమ్మెల్యే బొడ్డుపల్లి రామశర్మ(83) ఇకలేరు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ నిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందిన ఆయన గురువారం ఉదయం 7 గంటలకు తుదిశ్వాస విడిచారు. రామశర్మ మృతి పట్ల వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ సహా పలువురు నాయకులు సంతాపం తెలిపారు.



రామశర్మ స్వస్థలంనల్లగొండ జిల్లా, డిండి మండలం, కందుకూరు. దేవరకొండ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి (1972 నుంచి 78 వరకు) ఎమ్మెల్యేగా, నల్లగొండ జిల్లా కమ్యునిస్ట్‌ పార్టీ కన్వీనర్‌గా, జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో వివిధ హోదాల్లో ఆయన తన సేవలు అందించారు. రేపు(శుక్రవారం) మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు ప్రజల సందర్శనార్థం ఆయన పార్థీవ దేహాన్ని సీపీఎం రాష్ట్ర కార్యాలయమైన ముగ్థుం భవన్‌లో ఉంచుతామని, అనంతరం స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహిస్తామని సీపీఐ నేత పల్లా వెంకట్‌రెడ్డి తెలిపారు. రామశర్మకు ఇద్దరు కొడుకులు, ఐదుగురు కూతుర్లున్నారు.



గొప్ప యోధుడిని కోల్పోయాం : వైఎస్ జగన్

సీపీఐ సీనియర్ నాయకుడు రామ శర్మ మరణం పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి సంతాపం తెలిపారు. శర్మ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. తెలంగాణ సాయుధ పోరాటంలో కీలక భూమిక పోషించిన రామశర్మ గొప్ప కమ్యూనిస్టు యోధుడని జగన్ కొనియాడారు. నీతి నిజాయితీ కోసం నిలబడిన గొప్ప నాయకుడని గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top