అయ్యప్ప ఆలయ ఆచారాల్లో సుప్రీం జోక్యం తగదు
న్యూఢిల్లీ: శబరిమల పుణ్యక్షేత్ర ఆచార వ్యవహారాల్లో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడం తగదని రాజ్యసభ సభ్యుడు రాజీవ్ చంద్రశేఖర్ సోమవారం వ్యాఖ్యానించారు. కేరళలోని శబరిమల ఆలయ ఆచారాలను హిందువులు, భారతీయులు గౌరవిస్తారని, 22 ఏళ్లుగా అయ్యప్ప మాల వేసుకుంటున్న భక్తుడినని, పవిత్ర ఆలయ సంప్రదాయాల్లో కలగజేసుకునేందుకు కోర్టు చేస్తున్న ప్రయత్నాలు ఆక్షేపణీయమని పేర్కొన్నారు. రుతుక్రమం వయసులో ఉన్న మహిళలకు శబరిమల ఆలయంలోకి నిషేధాన్ని జనవరి 11న ఒక కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రశ్నించింది.
కాగా, కేంద్ర సంస్కృతి, పర్యాటక శాఖ సహాయ మంత్రి మహేశ్ శర్మ శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని సమర్ధించారు. ఆలయ ప్రవేశాల్లో లింగ వివక్ష ఉండొద్దన్నారు. 12 భాషల్లో రోజంతా అందుబాటులో ఉండే టూరిస్ట్ హెల్ప్లైన్ను శర్మ సోమవారం ప్రారంభించారు.