కమలహాసన్పై విరుచుకుపడ్డ శరత్కుమార్
చెన్నై : నటుడు కమలహాసన్ కృతజ్ఞత లేని వారు. చేసిన మేలు మరచిన కృతఘ్నుడు అని నటుడు శరత్కుమార్ దుయ్యబట్టారు. నడిగర్సంఘం ఎన్నికలు ఈ నెల 18న జరగనున్న విషయం తెలిసిందే.ఈ ఎన్నికల్లో నటుడు శరత్కుమార్ జట్టు, విశాల్ జట్లు ఢీకొంటున్న సంగతి విదితమే. ఇరు జట్లు తమ మ్యానిఫెస్టోలను విడుదల చేశారు. కాగా ఒక ఫిలిం ఇన్స్టిట్యూట్ విద్యార్థులు నిర్వహించిన సర్వేలో విశాల్ జట్టుకు 64 శాతం, శరత్కుమార్ జట్టుకు 26 శాతం ఓట్లు పడతాయని పేర్కొనడం గమనార్హం.
ఈ నేపథ్యంలో నటుడు శరత్కుమార్ కమలహాసన్ పై ఫైర్ అయ్యారు. ఆయన చేసిన మేలు మరచే కృతఘ్నుడుని దుయ్యబట్టారు. కమలహాసన్ నటించిన విశ్వరూపం చిత్రం విడుదల సమయంలో సమస్యలు ఎదురైప్పుడు తాను సాయం చేశానన్నారు. అదేవిధంగా ఉత్తమవిలన్ చిత్ర విడుదలప్పుడూ తన భార్య రాధికా సాయం చేశారన్నారు.
అలాంటిది నడిగర్సంఘం ఎలాంటి సాయం చేయలేదని కమల్ అనడం కృతజ్ఞతా హీనంగా పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో కమలహాసన్ పోటీ జట్టుకు పరోక్షంగా మద్దతు పలుకుతున్నారని శరత్కుమార్ ఆరోపించారు.