బొంతల్లో రూ. 18 కోట్లు దాచారు
కాన్పూర్: పెద్ద నోట్ల రద్దు తర్వాత సామాన్య ప్రజలు ఇప్పటికీ కరెన్సీ సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఏటీఎంలలో డబ్బులు దొరకక జనం ఇబ్బంది పడుతున్నారు. కాగా ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో సేల్స్ ట్యాక్స్ అదనపు కమీషనర్ కేశవ లాల్ ఇంట్లో ఐటీ దాడుల్లో పట్టుబడ్డ కొత్త నోట్లు చూసి అధికారులే షాకయ్యారు. కేశవ్ ఇంట్లో 18 కోట్ల రూపాయల విలువైన కొత్త కరెన్సీ నోట్లు, రెండు కిలోల బంగారం బయటపడ్డాయి.
బొంతల్లోనూ, అల్మారాల్లోనూ దాచిన డబ్బును ఐటీ అధికారులు వెలికితీశారు. నోయిడా సహా ఇతర నగరాల్లో ఉన్న కేశవ్కు చెందిన స్థిరాస్తుల డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. కేశవ లాల్కు చెందిన బ్యాంకు లాకర్లు, ఇతర ప్రాంతాల్లో సోదాలు చేస్తే మరింత నగదు లభిస్తుందని అధికారులు భావిస్తున్నారు. బుధవారం రాత్రి నుంచి గురువారం రాత్రి వరకు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. లక్నో వెళ్లిన కేశవ్ లాల్ను ఐటీ అధికారులు కాన్పూర్కు రప్పించి అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. కాన్పూర్లో ఐటీ శాఖ అధికారులు మరికొందరు అధికారుల ఇళ్లపై దాడులు చేసి భారీ మొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్నారు.