దోపిడీ, సామూహిక అత్యాచారం, భర్తకు కత్తిపోట్లు
రాజస్థాన్లో ఘోరం జరిగింది. రాష్ట్ర రాజధాని జైపూర్ నగరంలోని అత్యంత విలాసవంతమైన వైశాలి నగర్ ప్రాంతంలో ఓ ఇంట్లో దోపిడీకి వచ్చిన దుండగులు.. అక్కడ 30 ఏళ్ల మహిళపై సామూహిక అత్యాచారం చేసి, ఆమె భర్తను కత్తితో పలుమార్లు పొడిచారు. వంటగది కిటికీ గ్రిల్ను తొలగించి ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు.. అక్కడున్న ఓ పెద్దమనిషిని తాడుతో కట్టేశారు. పిల్లలను కత్తితో బెదిరించి గదిలో పెట్టేశారు. తర్వాత ఆ పెద్దమనిషి కొడుకును పలుమార్లు కత్తితో పొడవడంతో అతడు స్పృహ కోల్పోయాడు. ఆ తర్వాత అతడి భార్య ఒకరి తర్వాత ఒకరుగా అత్యాచారం చేశారు.
తర్వాత బాధితుడిని ఆస్పత్రిలో చేర్చి, అతడికి రెండు శస్త్రచికత్సలు చేశారు. దుండగులు పెద్దమనిషిని తాళ్లతో మరీ గట్టిగా కట్టేయడంతో అతడి కాలు విరిగింది. జైపూర్ నగరంలో ఇలాంటి దోపిడీ జరగడం ఇదే తొలిసారి. నేరానికి వచ్చినవాళ్లు సామూహిక అత్యాచారం చేయడం కూడా ఇంతకుముందు ఎన్నడూ లేదు. వాళ్లు సుమారు రూ. 10వేల నగదు, 150 గ్రాముల బంగారు ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులతో అక్కడినుంచి వెళ్లిపోయారు. కత్తిపోట్లకు గురైన వ్యక్తి నగల వ్యాపారం చేస్తుంటారు. అతడిని పొట్టలోను, వీపుమీద, ఇతర ప్రాంతాల్లో 8-9 సార్లు పొడిచారు.
ఆ తర్వాత అతడి భార్యను తాడుతో కట్టేసి, లైట్లు ఆర్పేసి ఒకరి తర్వాత ఒకరుగా ఆమెపై అత్యాచారం చేశారు. ఈలోపు మిగిలిన ముఠా సభ్యులంతా కలిసి దోపిడీ కొనసాగించారు. అత్యాచారం చేసిన తర్వాత ఆ మహిళ ఒంటిమీద ఉన్న నగలను కూడా వారు దోచుకెళ్లారు. అల్మారా తెరిచి, అందులో ఉన్న వస్తువులన్నీ చెల్లాచెదురు చేసి అక్కడినుంచి పారిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు.