వేకప్ కాల్ చేయనందుకు.. రూ. 5 వేలు జరిమానా
భోపాల్: రైలులో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడి విజ్ఞప్తి మేరకు కస్టమర్ కేర్ సర్వీసు ఆయనకు వేకప్ కాల్ చేయనందుకు రైల్వే శాఖ 5 వేల రూపాయలను పరిహారంగా చెల్లించింది. మధ్యప్రదేశ్లోని బీతుల్ జిల్లాకు చెందిన గిరీష్ గార్గ్ అనే న్యాయవాది 2015 జూన్ 13న కోయంబత్తూర్-జైపూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో ప్రయాణించారు. ఆయన కోటాలో దిగాలి. షెడ్యూల్ ప్రకారం రైలు అర్ధరాత్రి 1:30 గంటలకు కోటాకు వెళ్తుంది. దీంతో గార్గ్ రైల్వే కస్టమర్ కేర్ నెంబర్ 139కు ఫోన్ చేసి ఈ విషయాన్ని చెప్పి, తనకు డెస్టినేషన్ (గమ్యస్థానం) అలర్ట్, వేకప్ (నిద్రలేపుట) అలర్ట్ పంపాల్సిందిగా కోరారు. కస్టమర్ సర్వీసు సిబ్బంది ఇందుకు అంగీకరించి ఆయన నెంబర్ను రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.
రైలు కోటాకు చేరే ముందుగా కస్టమర్ కేర్ సర్వీసు నుంచి వేకప్ కాల్ వస్తుందనే ఉద్దేశంతో గార్గ్ నిద్రపోయారు. కాగా ఆయనకు అలర్ట్ కానీ వేకప్ కాల్ కానీ రాలేదు. ఆయన కాస్త ఆలస్యంగా మేల్కొని కోటాలో హడావుడిగా రైలు దిగారు. కస్టమర్ కేర్ సర్వీసులో లోపముందని భావించి కన్జూమర్ ఫోరమ్లో ఆయన కేసు వేశారు. తనకు మానసికంగా ఇబ్బంది కలిగించినందుకు 20 వేల రూపాయలు పరిహారంగా చెల్లించాల్సిందిగా రైల్వే శాఖను ఆదేశించాల్సిందిగా కోరారు. కస్టమర్ కేర్ సర్వీసుకు వచ్చే కాల్స్కు చార్జీలు వర్తించవని, కావున సర్వీసులో లోపమనేది ఉండదని రైల్వే శాఖ వాదించింది. ఈ పిటిషన్ను కొట్టివేయాల్సిందిగా కోరింది. కాగా సర్వీసులో లోపముందని నిర్ధారించిన కన్జూమర్ ఫోరమ్.. నెల రోజుల్లోపు గార్గ్కు 5 రూపాయలు పరిహారం చెల్లించాల్సిందిగా రైల్వే శాఖను ఆదేశించింది. అలాగే కోర్టు ఖర్చుల కింద గార్గ్కు మరో 2 వేల రూపాయలు చెల్లించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది.