సమ్మెపై పునరాలోచన చేయాలి
హైదరాబాద్ : జాతీయ రహదారి భద్రతా బిల్లుకు వ్యతిరేకంగా తలపెట్టిన సార్వత్రిక సమ్మెపై (సెప్టెంబర్ 2న) ట్రేడ్ యూనియన్లు పునరాలోచన చేయాలని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ విజ్ఞప్తి చేశారు. దినసరి కనీస వేతనం రూ.270కి పెంచేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని ఆయన మంగళవారమిక్కడ తెలిపారు. ట్రేడ్ యూనియన్ల 9 డిమాండ్లకు కేంద్రం సానుకూలంగా ఉందని, కాంట్రాక్ట్ కార్మికులకు సామాజిక భద్రత, ఉద్యోగ రక్షణ కల్పిస్తామని బండారు పేర్కొన్నారు.
సమాన పనికి సమాన వేతనం అంశంపై కమిటీ వేస్తున్నామని చెప్పారు. ఇప్పటికే అసంఘటిత రంగ కార్మికుల సామాజిక భద్రత కోసం పెన్షన్, బీమా సదుపాయం తీసుకు వచ్చామని బండారు గుర్తు చేశారు. సమ్మెకు బీఎంఎస్ సహా అనేక సంఘాలు దూరంగా ఉన్నాయని, కేవలం కొన్ని మాత్రమే సమ్మె చేస్తున్నాయని అన్నారు. మోదీ సర్కార్ కార్మికుల సంక్షేమం, భద్రత, కార్మిక సంస్కరణలకు కట్టుబడి ఉందన్నారు.