రేప్ నిందితుడికి ముందస్తు బెయిల్
ముంబై: అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడికి బాంబే హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. బాధితురాలిని పెళ్లి చేసుకునేందుకు నిందితుడు జయవంత్ జాదవ్ కు న్యాయమూర్తి జస్టిస్ ఏఎస్ గడ్కరీ బెయిల్ ఇచ్చారు. బాలికను మోసం చేసి లైంగిక సంబంధం పెట్టుకున్న జాదవ్ పై ఏప్రిల్ 4న ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయమైన బాలికతో జాదవ్ పరిచయం పెంచుకున్నాడు. తర్వాత వారిద్దరూ హద్దులు దాటారు.
విషయం తెలిసిన బాలిక తల్లిదండ్రులు పెళ్లి చేయాలని జాదవ్ తల్లిదండ్రులను కోరగా వారు తిరస్కరించారు. దీంతో బాధితురాలి తల్లిదండ్రులు కేసు పెట్టారు. అయితే బాలికను పెళ్లాడేందుకు నిందితుడు ఒప్పుకోవడంతో కోర్టు ఈనెల 28 వరకు ముందస్తు బెయిలిచ్చింది. భవిష్యత్ లో ఆమెకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని జాదవ్, అతడి కుటుంబ సభ్యులకు కోర్టు సూచించింది. తదుపరి విచారణను ఈనెల 28కి వాయిదా వేసింది.