యోగి సర్కారుతో రాహుల్‌ ఢీ!

యోగి సర్కారుతో రాహుల్‌ ఢీ!

  • అనుమతి ఇవ్వకున్నా షహరాన్‌పూర్‌లో పర్యటన



  • న్యూఢిల్లీ: షహరాన్‌పూర్‌ అల్లర్ల నేపథ్యంలో యోగి ఆదిత్యనాథ్‌ సర్కారుతో నేరుగా తలపడేందుకు కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ సై అంటున్నారు. ఉత్తరప్రదేశ్‌ అధికారులు అనుమతి నిరాకరించినా.. రాహుల్‌గాంధీ శనివారం షహరాన్‌పూర్‌లో పర్యటించేందుకు బయలుదేరారు. దళితులు, రాజ్‌పుత్‌ ఠాకూర్ల మధ్య తలెత్తిన హింసాత్మక ఘర్షణలతో షహరాన్‌పూర్‌ అట్టుడికిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజకీయ నాయకులు ఎవరూ ఈ ప్రాంతాన్ని సందర్శించవద్దని, వారి పర్యటనలకు అనుమతి లేదని ఉత్తరప్రదేశ్‌ అదనపు డీజీ (శాంతిభద్రతలు) ఆదిత్య మిశ్రా శుక్రవారం స్పష్టం చేశారు.



    అనుమతి లేకపోయినప్పటికీ శనివారం నాడు షహరాన్‌పూర్‌ను సందర్శించాల్సిందేనని రాహుల్‌ నిర్ణయించారు. ఆయన షహరాన్‌పూర్‌లో క్షేత్రస్థాయిలో పర్యటించి..  స్థానికంగా పరిస్థితిని సమీక్షించాలని, బాధితులతో మాట్లాడాలని భావిస్తున్నారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి సభ ముగిసిన తెల్లారే షహరాన్‌పూర్‌లో అల్లర్లు తీవ్రమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిషేధాజ్ఞలను ఉల్లంఘించి పర్యటనకు సిద్ధమైన రాహుల్‌పై యోగి సర్కారు ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది ఉత్కంఠగా మారింది.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top