మంత్రి ఇంట్లో పోలీసుల సోదాలు
లక్నో: ఉత్తరప్రదేశ్ మంత్రి గాయత్రి ప్రజాపతి ఇంట్లో పోలీసులు మంగళవారం సోదాలు నిర్వహించారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో పోలీసులు సోదాలు జరిపారు. దర్యాప్తులో భాగంగా సోదాలు నిర్వహించామని, త్వరలోనే ఆయనను అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలతో అంతకుముందు ప్రజాపతి, ఆయన ఆరుగురు అనుచరులపై యూపీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
తనపై, తన మైనర్ కూతురుపై ప్రజాపతి ఆయన అనుచరులు లైంగిక దాడికి పాల్పడ్డారని ఓ మహిళ ఫిర్యాదు చేసింది. ఉత్తరప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేసేందుకు నిరాకరించడంతో బాధితురాలు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కోర్టు ఆదేశించిన తర్వాతే పోలీసులు కేసు నమోదు చేశారు. ఎనిమిది వారాల్లోగా నివేదిక ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది.