పోలీస్ కాఠిన్యం..!
- చిన్న గొడవకు పెద్ద శిక్ష
- యువకుడిని మొద్దుకు కట్టేసి ప్రతాపం?
- బయటకు వచ్చిన ఫొటో
- సోషల్మీడియాలో హల్చల్
సాక్షి, జగిత్యాల: జగిత్యాల జిల్లాలో పోలీసుల కాఠిన్యం వెలుగుచూసింది. గొడవకు కారణమయ్యాడంటూ.. సదరు యువకుడికి అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిని మొద్దుకు కట్టేసిన ఫొటోలు సోషల్మీడియాలో హల్చల్ చేశాయి. జగిత్యాల పట్టణంలో ఆదివారం ఓ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో పట్టణంలోని తీన్ఖని ప్రాంతానికి చెందిన యువకుడు ముహమ్మద్ సల్మాన్ఖాన్ తనకూ మాట్లాడే అవకాశం కల్పించాలంటూ పట్టుబట్టాడు. దీనికి సదరు పార్టీకి చెందిన ఓ ద్వితీయ శ్రేణి నాయకుడు నిరాకరించాడు.
ఈ క్రమంలో ఇరువురి మధ్య వాగ్వాదం జరగగా, ద్వితీయ శ్రేణి నాయకుడు సల్మాన్పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సల్మాన్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతన్ని పోలీస్స్టేషన్లో మొద్దుకు కట్టేశారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో హల్చల్ చేయడం.. సల్మాన్ బంధువులు సైతం పోలీస్స్టేషన్కు వచ్చారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య రాజీ కుదరడంతో మూడు గంటల తర్వాత సల్మాన్ను విడిచిపెట్టారు. ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు కానప్పటికీ పోలీసులు అత్యుత్సాహంతో... సల్మాన్ పారిపోతాడంటూ మొద్దుకు కట్టివేయడంతో ప్రజల్లో తీవ్ర నిరసన పెల్లుబికుతోంది.
పారిపోతారనే ఉద్దేశంతోనే..
సభ్యత్వ నమోదులో గొడవ జరగడంతో సల్మాన్పై ఫిర్యాదు అందింది. దీంతో పోలీసులు సల్మాన్ను తీసుకొచ్చారు. గతంలో ఠాణా నుంచి కొందరు పారి పోయిన నేపథ్యంలో ముందుజాగ్రత్తగా కట్టేస్తున్నాం. కానీ, సల్మాన్ను మొద్దుకు కట్టేసిన విషయం నాకు తెలియదు. విషయం తెలియగానే కట్టు విప్పించాను.
– ప్రకాశ్, సర్కిల్ ఇన్స్పెక్టర్. జగిత్యాల