తెలుగు రాష్ట్రాల్లో ‘పీఎంజీఎస్‌వై’ నత్తనడక

తెలుగు రాష్ట్రాల్లో  ‘పీఎంజీఎస్‌వై’ నత్తనడక


► రాష్ట్రాలకు 2017–18 లక్ష్యాలను కుదించిన నీతి ఆయోగ్‌


సాక్షి,న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల్లో ప్రధానమంత్రి గ్రామ్‌ సడక్‌ యోజన (పీఎంజీ ఎస్‌వై) పనులు నత్తనడకన కొనసాగుతున్నాయని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. మోదీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పరిగణిస్తున్న పీఎంజీఎస్‌వై అమలు తెలుగు రాష్ట్రాల్లో అసంతృప్తికరంగా ఉందని నీతి ఆయోగ్‌ గుర్తించింది. 2016–17కు గాను పీఎంజీఎస్‌వై కింద చేపట్టిన రహదా రుల నిర్మాణంలో ఏపీ 54 శాతం, తెలంగాణ 45 శాతం లక్ష్యాలను మాత్రమే సాధించాయి.



కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ వద్ద ఉన్న గణాంకాల ప్రకారం 2016–17కుగాను ఏపీలో రహదారుల నిర్మాణం లక్ష్యం 1,350 కి.మీ. కాగా గత మార్చి నాటికి 733.55 కి.మీ. మేరకు రహదారుల నిర్మాణం పూర్తి అయింది. తెలంగాణలో 2016–17కుగాను 900 కి.మీ. లక్ష్యంకాగా కేవలం 408.64 కి.మీ. మేరకు రహదారుల నిర్మాణం పూర్తి అయింది. దీంతో ఏపీ, తెలంగాణల్లో 2017–18 కిగాను పీఎంజీఎస్‌వై అమలు లక్ష్యాలను నీతిఆయోగ్‌ కుదించింది. తెలుగురాష్ట్రాలతోపాటుగా దేశంలోని పలు రాష్ట్రాలకు 2017–18 కిగాను ఇప్పటికే ఖరారు చేసింది.



నీతి ఆయోగ్‌ సీఈవో అమితాబ్‌ కాంత్‌ అధ్యక్షతన గత వారం జరిగిన ప్రధానమంత్రి మౌలిక సదుపాయాల సమీక్షా సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. పీఎంజీఎస్‌వై అమలు లక్ష్యాలను సంతృప్తికరంగా సాధించిన రాష్ట్రాలకు 2017–18కిగాను లక్ష్యాలను పెంచింది. 2017–18కిగాను దేశవ్యాప్తంగా 55,370 కి.మీ. రహదారుల నిర్మాణం లక్ష్యంగా పేర్కొంది. అయితే, సమావేశం తర్వాత రహదారుల నిర్మాణ లక్ష్యం 57,000 కిలోమీటర్లకు పెరిగింది.



ఏపీ, తెలంగాణల్లో ఇప్పటికే ఖరారైన 800, 700 కిలోమీటర్ల రహదారుల నిర్మాణం లక్ష్యాన్ని 500 కిలోమీటర్లకు కుదించారు. ఫలితంగా తెలుగురాష్ట్రాలకు పీఎంజీఎస్‌వై కింద నిధుల మంజూరులో కోత ఏర్పడింది. నెలవారీగా లక్ష్యాలను కేటాయించుకొని కచ్చితమైన పర్యవేక్షణ ద్వారా అమలు చేయాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top