పియూష్ మామూలోడు కాదు!
కాన్పూర్: యూపీ బిలీయనీర్ 'బిస్కట్ కింగ్' ఓంప్రకాశ్ దాసాని కోడలు జ్యోతి దాసాని హత్య కేసులో ఊహించని విషయాలు వెల్లడవుతున్నాయి. భార్యపై మోజు తగ్గడంతో జ్యోతి భర్త పియూష్ శ్యామ్ దాసాని ఆమెను చంపించినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. పొరుగింట్లో ఉండే పాన్ మసాలా కంపెనీ యజమాని కూతురు మనీషా మఖీజా(27)తో అక్రమ సంబంధం పెట్టుకుని పియూష్ తన భార్యను అడ్డుతొలగించుకున్నాడు.
అయితే కథ ఇక్కడితో అయిపోలేదు. మనీషాతోనే కాకుండా పలువురు యువతులతో పియూష్ వ్యవహారాలు నడిపినట్టు నిర్ధారణయింది. అతడి ఫోన్ కాల్ డేటా ఆధారంగా ఈ విషయం వెల్లడైంది. గత రెండు నెలల కాలంలో మనీషాకు అతడు 663 సార్లు ఫోన్ చేశాడు. తన కంపెనీలో పనిచేసే పెళ్లికాని యువతికి దాదాపు 330 సార్లు కాల్ చేసినట్టు పోలీసులు తెలిపారు. మనీషాను పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. తన ప్రియురాలు మనీషాకు పియూష్ ఐదు సిమ్ కార్డులు ఇచ్చినట్టు పోలీసులు వెల్లడించారు. నకిలీ ఐడీలతో అతడు ఈ సిమ్ కార్డులు తీసుకున్నాడని చెప్పారు.
ఆదివారం రాత్రి జ్యోతి దాసాని హత్యకు గురైంది. ఆమె శరీరంలో 14 కత్తిపోట్లు ఉన్నాయి. పాంకీ ప్రాంతంలో పార్క్ చేసివున్న కారులో జ్యోతి మృతదేహాన్ని కనుగొన్నారు. ప్రియురాలి డ్రైవర్, అతడి అనుచరుడి సహాయంతో పియూషే తన భార్యను హత్య చేయించినట్టు పోలీసుల దర్యాప్తులో బయటపడడంతో వీరందరినీ అరెస్ట్ చేశారు. కాగా, విచారణ కోసం కోర్టు వచ్చిన పియూష్పై న్యాయవాదులు మూడుసార్లు దాడి చేశారు.