వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీలపై పవన్‌ ప్రశంసల జల్లు

వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీలపై పవన్‌ ప్రశంసల జల్లు - Sakshi

  • ప్రత్యేక హోదాపై ప్రశంసనీయమైన పోరాటం చేస్తున్నారని కితాబు

  • ఏపీ ప్రజల ఆత్మగౌరవాన్ని కేంద్రానికి తాకట్టు పెట్టొద్దంటూ టీడీపీపై ఫైర్‌

  • ప్రత్యేక హోదా చర్చలో ఎందుకు పాల్గొనలేదని నిలదీత

  • హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశంపై పార్లమెంటులో చర్చ సందర్భంగా టీడీపీ ఎంపీలు గైర్హాజరు కావడాన్ని సినీ నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ తప్పుబట్టారు. టీడీపీ నేత, కేంద్రమంత్రి అశోక్‌ గజపతిరాజు ఈ చర్చలో పాల్గొనకుండా మౌనంగా ఉండటం ఎంతో బాధపెట్టిందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన ప్రత్యేక హోదాపై రాజీపడే హక్కు టీడీపీకి లేదన్నారు. ఏపీ ప్రజల ఓట్లతో టీడీపీ-బీజేపీ అధికారంలోకి వచ్చిందన్న విషయాన్ని గుర్తుచేశారు. మంగళవారం రాజ్యసభలో ప్రత్యేక హోదాపై జరిగిన చర్చకు సంబంధించిన న్యూస్‌ క్లిప్పింగ్స్‌తో పవన్‌ కల్యాణ్‌ గురువారం వరుసగా ట్వీట్లు చేశారు.



    ప్రత్యేక హోదా సాధన విషయంలో వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీలు ప్రశంసనీయమైన కృషి చేస్తున్నారని కొనియాడారు. ఏపీకి ప్రత్యేక హోదాకు మద్దతు తెలిపిన తెలంగాణ ఎంపీలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర విభజన సందర్భంగా టీడీపీ ఎంపీలను ఉత్తరాది ఎంపీలు పార్లమెంటులో చితకబాదిన అవమానాన్ని ఆ పార్టీ ఎంపీలు మరిచిపోయినట్టుందని విమర్శించారు. టీడీపీ తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఏపీ ప్రజల ఆత్మగౌరవాన్ని కేంద్రానికి తాకట్టు పెట్టకూడదన్నారు. కేంద్రం విషయంలో కొంచెం సహనంతో వ్యవహరించడం సరైనదే అయినా.. తరచూ అన్యాయాలు ఎదురవుతుంటే.. ఇంకా సహించి ఏం ప్రయోజనమని టీడీపీని ప్రశ్నించారు. పాపులర్‌ డిమాండ్‌ మేరకు ఉత్తరప్రదేశ్‌ను ఎందుకు విభజించలేదని ఆయన ప్రశ్నించారు. లేక కేవలం దక్షిణాది రాష్ట్రం ఏపీకి మాత్రమే ఈ నిబంధన వర్తిస్తుందా? అని పేర్కొన్నారు.

     

     

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top