అభిమాని చేసిన పనికి టీవీ యాంకర్ ఆస్పత్రిపాలైంది
కరాచీ: పాకిస్థాన్లో మహిళలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఓ టీవీ ఛానెల్ యాంకర్ ఈ సారి బాధితురాలిగా మారింది. అభిమాని దురాభిమానం వల్ల చేసిన పనికి ఆమె ఆస్పత్రిపాలైంది.
పాక్కు చెందిన అబ్ టక్ అనే ఉర్దూ న్యూస్ ఛానెల్లో యాంకర్గా పనిచేస్తున్న సనా ఫైజల్ ఆదివారం రాత్రి భర్తతో కలసి కరాచీలోని ఓ ఐస్క్రీమ్ స్టోర్కు వెళ్లింది. అక్కడ 15 ఏళ్ల మైనర్ బాలుడు వచ్చి అభిమానినంటూ ఆమెతో పరిచయం చేసుకున్నాడు. సనాతో సెల్ఫీ దిగి, ఆటోగ్రాఫ్ తీసుకున్నాడు. ఆ తర్వాత అభిమాని కానుకగా ఆమెకు ఐస్ క్రీమ్ ఇచ్చాడు. ఐస్ క్రీమ్ తిన్న తర్వాత సనా భర్తతో కలసి ఇంటికి బయల్దేరింది. మార్గమధ్యంలో ఆమె అస్వస్థతకు గురవడంతో భర్త వెంటనే ఆస్పత్రికి తరలించాడు. సనా తిన్న ఐస్ క్రీమ్ విషతుల్యమైందని వైద్యులు నిర్ధారించారు. పోలీసులు సనా స్టేట్మెంట్ రికార్డు చేసి కేసు నమోదు చేశారు. ఆమె పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు.