ట్యునీషియా కమిటీకి నోబెల్ శాంతి బహుమతి
స్టాక్హోమ్: ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి పురస్కారం 2015 సంవత్సరానికి ట్యునీషియా జాతీయ సంప్రదింపుల బృందానికి దక్కింది. నాలుగు కమిటీల బృందానికి శాంతి బహుమతిని అవార్డుల కమిటీ శుక్రవారం ప్రకటించింది. 2011లో ట్యునీషియాలో జాస్మిన్ ఉద్యమం నేపథ్యంలో ప్రజాస్వామ్య వ్యవస్థను నిర్మించేందుకు జాతీయ సంప్రదింపుల బృందం విశేష కృషి చేసిందని అవార్డుల కమిటీ ప్రశంసించింది. 273 మంది పోటీదారులను వెనక్కి నెట్టి ట్యునీషియా బృందం అవార్డు దక్కించుకుంది. జర్మనీ ఛాన్సలర్ ఎంజెలా మెర్కల్, పోప్ ఫ్రాన్సిస్ కూడా అవార్డు పోటీలో ఉన్నారు.
ట్యునీషియాలో రాజకీయ హత్యలు, సామాజిక సంక్షోభం తలెత్తడంతో 2013 సమ్మర్ లో ఈ బృందాన్ని ఏర్పాటు చేశారు. సివిల్ వార్ సమయంలో ఈ బృందం శాంతియుత సంప్రదింపులతో ప్రజాస్వామ్య వ్యవస్థ స్థాపనకు బాటలు వేసింది. రాజ్యాంగ వ్యవస్థను విస్తరించి సమస్త ప్రజల ప్రాథమిక హక్కుల పరిరక్షణకు పాటుపడింది. ఈ బృందంలో లేబర్ యూనియన్, సీఐఐ, మానవ హక్కులు, న్యాయవాద సంఘాలు సభ్యులుగా ఉన్నాయి.