నోబెల్ గెలిచి.. వైద్యానికి డబ్బులేక దుర్మరణం
ఆయన రసాయన శాస్త్ర పరిశోధనలలో చేసిన కృషికి గాను నోబెల్ బహుమతి పొందారు. కానీ, కనీసం తన అనారోగ్యానికి చికిత్స చేయించుకోడానికి కూడా డబ్బు లేక నిస్సహాయ స్థితిలో మరణించారు. 2010లో నోబెల్ బహుమతి పొందిన రిచర్డ్ హెక్ (84).. ఫిలిప్పీన్స్ రాజధాని మనిలాలో అత్యంత దుర్భర స్థితిలో ప్రాణాలు వదిలారు. ఆయన పలు రకాల అనారోగ్యాలతో బాధపడుతున్నారు. 2006లో ఆయన రిటైరయ్యారు. నోబెల్ వచ్చిన రెండేళ్లకు ఆయన భార్య సొకారో నార్డో హెక్ మరణించారు. అయితే ఈ దంపతులకు పిల్లలు లేకపోవడంతో.. ఆయన మేనల్లుడే రిచర్డ్ హెక్ బాగోగులు చూసుకుంటున్నాడు.
నెలకు తనకొచ్చే కొద్దిపాటి పెన్షన్తోనే హెక్ ఇన్నాళ్లు కాలం గడిపారు. అయితే తనకొచ్చిన అనారోగ్యాలకు చికిత్స చేయించుకోడానికి ఆ సొమ్ము సరిపోయేది కాదు. ఉన్నట్టుండి ఆయనకు వాంతులు కావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. కానీ, బిల్లులు చెల్లించడానికి డబ్బు లేకపోవడంతో ఆస్పత్రి వర్గాలు ఆయనను చేర్చుకోడానికి నిరాకరించాయి. దాంతో ఆయనను ఓ ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. కొద్ది గంటల్లోనే ప్రధాన అవయవాలన్నీ పనిచేయడం మానేసి.. ఆయన మరణించారు.