నెహ్రూ మేనకోడలి సంచలన నిర్ణయం
- కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును తిరగి ఇచ్చేసిన రచయిత్రి నయనతార సెహగల్
- సాస్కృతిక వైవిధ్యానికి మోడీ సర్కార్ తూట్లుపొడుస్తోందంటూ విమర్శలు.. నిరసనగా అవార్డు వదులుకుంటున్నట్లు వెల్లడి
న్యూఢిల్లీ: భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ మేనకోడలు, ప్రముఖ రచయిత్రి నయనతార సెహగల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సాహిత్యరంగంలో జాతీయ పురస్కారమైన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును తిరిగి కేంద్రానికే పంపుతున్నట్లు మంగళవారం వెల్లడించారు.
నరేంద్ర మోదీ ప్రధానిగా ఎన్నికయినప్పటినుంచి దేశంలో ప్రజాస్వామిక వాతావరణం చెడిపోయిందని, సాంస్కృతిక వైవిధ్యానికి తూట్లుపొడిచే ప్రక్రియ వేగవంతమైందని సెహగల్ విమర్శించారు. అందుకే ఎన్డీఏ తీరుకు నిరసనగా తనకు లభించిన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును వెనక్కిస్తున్నట్లు చెప్పారు. గతంలోనూ పలుమార్లు మోదీపై విమర్శలు చేసిన నయనతార.. అవార్డును వెనక్కి ఇవ్వడం సాహితీలోకంతోపాటు రాజకీయ రంగంలోనూ తీవ్ర చర్చనీయాంశమైంది.
నెహ్రూ సోదరి విజయలక్ష్మి పండిట్ కు రెండో సంతానంగా 1927లో జన్మించిన నయనతార.. దేశంలో పేరెన్నికగల ఆంగ్ల రచయితల్లో ఒకరిగా ఎదిగారు. రాజకీయ మార్పులతో దేశంలో సంభవిస్తోన్న మార్పులను ఆధారంచేసుకుని ఆమె రచించిన పలు పుస్తకాలు విశేష ఆదరణ పొందాయి. ఆమె రాసిన 'రిచ్ లైక్ అజ్' నవలకు 1986లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది.