ప్రధాని మోదీ తాజా హెచ్చరికల మర్మం ఏమిటి?
ముంబై: డిసెంబర్ 30 తర్వాత అవినీతి పరుల కష్టాలు పెరుగుతాయని స్పష్టం చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాటల వెనుక మరిన్ని కఠిన నిర్ణయాల అమలు వ్యూహం ఉందా. నేషనల్ ఇన్సిస్టిట్యూట్ ఆప్ సెక్యూరిటీస్ మార్కెట్ (ఎన్ఎస్ఐఎం) ముంబై క్యాంపస్ లో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని చేసిన హెచ్చరికలు ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. దేశ ప్రయోజనాలకోసం తమ ప్రభుత్వం తీసుకోబోయే కఠిన నిర్ణయాలు, స్వల్ప రాజకీయ ప్రయోజనకోసం చేసినవి కావని, భవిష్యత్తులో మరింత కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. ఈ విషయంలో తమకు ఎలాంటి మెహమాటం లేదనీ, డీమానిటైజేషన్ ఒక ఉదాహరణ మాత్రమేనని వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది.
డీమానిటైజేషన్ కష్టాలు స్వల్పకాలమేననీ, కానీ ఫలితాలు దీర్ఘకాలంగా ఉండనున్నాయని భరోసా ఇవ్వడంతోపాటు అవినీతి, నల్లకుబేరు గుండెల్లో బాంబులు పేల్చుతున్నారు. బ్యాంకుల్లో డబ్బు పడటంతో నల్లబాబుల కష్టాలు ముగిసినట్లు కాదని, అసలు కష్టాలు మొదలైనట్లు గుర్తించాలని హెచ్చరించారు. చట్లంలోని లోపాలను స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకోవాలని చూస్తున్నవారు ప్రస్తుతం ఉన్నది మోదీ సర్కారనేది గుర్తుంచుకోవాలంటూ గట్టి వార్నింగ్ ఇచ్చారు.
తమ కఠిన నిర్ణయాలు కొనసాగుతాయని, దీర్ఘకాలంలో ఒక ప్రకాశవంతమైన భవిష్యత్తు కోసం ఆర్థిక విధానాలు అనుసరిస్తామని ప్రధాని పేర్కొన్నారు. అభివృద్ది చెందిన, చెందుతున్న మార్కెట్లలో అభివృద్ధి నెమ్మదించిందని ప్రధాని తెలిపారు. ఈ నేపథ్యంలో భారతదేశం ప్రశాశవంతంగా నిలవనుందని వ్యాఖ్యానించారు. ఆర్థిక వృద్ధిలో దేశం ప్రపంచంలో అత్యధికంగా నిలవనుందని పునరుద్ఘాటించారు.
బ్యాంకుల్లో డబ్బు డిపాజిట్ చేయడంతోనే అయిపోలేదన్న మోదీ తాజా హెచ్చరిక మార్కెట్ వర్గాలను ఆలోచనలో్ పడేసింది. దీంతో పెద్ద నోట్ల రద్దు చర్య చివరిది కాదని ..భవిష్యత్తులో మరిన్ని కఠిన నిర్ణయాలు తప్పవని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.