రాడికల్ హ్యూమనిస్ట్ ఎన్వి బ్రహ్మం కన్నుమూత
ప్రకాశం: ప్రకాశం జిల్లాలోని చీరాల సమీపంలో ఉన్న చిన్నగంజం గ్రామంలో జులై 27న ప్రముఖ రాడికల్ హ్యూమనిస్ట్ ఎన్.వి బ్రహ్మం (85) కన్ను మూశారు. ఎన్ వీ బ్రహ్మానికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. చీరాలలో రాడికల్ హ్యూమనిస్ట్ తెలుగు పక్షపత్రికలో సంపాదకుడిగా ఆయన పనిచేశారు. 1948లో డెహ్రడూన్లో జరిగిన రాడికల్ హ్యూమనిస్ట్ క్యాంప్లో హ్యూమనిస్ట్ ఉద్యమ స్థాపకుడు ఎమ్ ఎన్ రాయ్ తొలి అనుచరుడిగా బ్రహ్మం పాల్గొన్నారు.
బ్రహ్మం రాసిన 'బైబిల్ బండారం' అనే పుస్తకాన్ని అప్పట్లో ప్రభుత్వం నిషేదించింది. అనంతరం సుప్రీం కోర్టు ఆ నిషేదాన్ని ఎత్తివేసింది. బ్రహ్మం మృతికి అమెరికా నుంచి నరిశెట్టి ఇన్నయ్య, సిద్దార్థ బక్స, విజయ బక్స, రావెళ్ల సోమయ్య తదితరులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. గొప్ప వ్యక్తిని కోల్పోయామంటూ వారి తరపునా ఆయన కుటుంబ సభ్యులకు, హేతువాద స్నేహితులకు తమ సానుభూతిని తెలియజేశారు.