'మండుతున్న నదిలో ఈదులాట'
చెన్నై: తన ప్రజాజీవితాన్ని మండుతున్న నదిలో ఈదులాటతో పోల్చారు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత. జైలు నుంచి విడుదలైన ఆమె ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజాజీవితంలో ఇలాంటి సమస్యలు ఎదుర్కొవలసి వస్తుందని తనకు తెలుసునన్నారు. సవాళ్లు, సమస్యలను అధిగమిస్తూ తమిళనాడు ప్రజల సంక్షేమానికి పాటుపడుతున్నానని ఆమె పేర్కొన్నారు. 'నా జీవితంలో చాలా సవాళ్లు ఎదుర్కొన్నాను. వాటిని సమర్థవంతంగా అధిగమించాను. నా ప్రజాజీవితమంతా మండుతున్న నదిలో ఈదులాటలావుంది'' అని వ్యాఖ్యానించారు.
తనకోసం ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దని తన మద్దతుదారులకు జయలలిత విజ్ఞప్తి చేశారు. తన కోసం చనిపోయిన వారి కుటుంబాలకు రూ. 3 లక్షల చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించారు. ఆత్మహత్యాయత్నం చేసిన ముగ్గురికి రూ. 50 వేల చొప్పున సాయం ఇవ్వనున్నారు. అక్రమాస్తుల కేసులో శిక్ష పడిన జయలలిత బెయిల్ పై జైలు నుంచి శనివారం విడుదలయ్యారు.