తన కారుపై కుక్క మూత్రం పోసిందని!

తన కారుపై కుక్క మూత్రం పోసిందని!


నోరులేని మూగ జీవాలపై మనుషుల అమానుష దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. మొన్నటికిమొన్న హైదరాబాద్‌లో ఓ కిరాతకుడు కుక్కను చంపి.. దానిపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఇద్దరు మెడికల్‌ విద్యార్థులు కుక్కను బంగ్లా మీద నుంచి కిందకు విసిరేసి.. ఆ వీడియో తీసి సోషల్‌ మీడియాలో పెట్టారు. ఇటీవల కొందరు పిల్లలు సరదా కోసం కుక్క తోక పట్టుకొని గిరగిరా తిప్పి విసిరేశారు.



తాజాగా ఇదేరీతిలో ముంబైకి చెందిన ఓ వ్యక్తి శునకంపై దుర్మార్గంగా ప్రవర్తించాడు. ఖరీదైన తన కారుపై వీధి కుక్క మూత్రం పోసిందని.. అది పడుకున్న సమయంలో దానిపైనుంచి పోనిచ్చాడు. దీంతో తీవ్రగాయపడిన కుక్క బాధతో విలవిలలాడింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో, ఫొటోలు, వివరాలను తాజాగా ‘ఫీడ్‌ ఏ స్ట్రే. ఎవ్రీడే’ ఫేస్‌బుక్‌ పేజీ వెలుగులోకి తెచ్చింది. వెంటనే ఈ పోస్టు వైరల్‌గా మారిపోయింది. ముంబైకి చెందిన సౌరబ్‌ దుఖాండే అనే వ్యక్తి ఈ దారుణానికి ఒడిగట్టినట్టు ఈ ఫేస్‌బుక్‌ పేజీ వెల్లడించింది.



‘సిగ్గులేని వ్యక్తి.. అమాయకమైన జీవులపై మనుషులు ఇంత క్రూరంగా ఎలా ఉండగలరు. తన కారుపై మూత్రం పోసిందనే కారణంగా పగ దీర్చుకోవాలని ఈ కుక్కపిల్ల పడుకొని ఉన్న సమయంలో దానిపై నుంచి కారును పోనిచ్చాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాడు చేసినా పట్టించుకోలేదు’ అని ఈ ఫేస్‌బుక్‌ పేజీ యూజర్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే, ఈ పోస్టు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన తర్వాత పోలీసులు నిందితుడిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారని మరో నెటిజన్‌ తెలిపారు.



 

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top