తనయుడికి ములాయం చురకలు
లక్నో: సమాజ్వాది పార్టీ జాతీయ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ తన కుమారుడు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కు చురకలు అంటించారు. రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు నెమ్మదిగా జరుగుతుండడంపై తనయుడికి అక్షింతలు వేశారు. అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసి వదిలేస్తున్నారే తప్పా వాటిని పూర్తి చేయడంలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.
'రాష్ట్రంలో ఎన్నో పథకాలున్నాయి. కానీ పనులు మాత్రం నెమ్మదిగా జరుగుతున్నాయి. పథకాల శంకుస్థాపనల గురించి వింటున్నాను. తర్వాత వాటిని పూర్తిచేసినట్టు ఎక్కడా కనబడడం లేదు. అభివృద్ధి పనులు పూర్తిచేసి ప్రారంభోత్సవానికి నన్ను పిలుస్తారని ఎదురుచూస్తున్నాను' అని ములాయం అన్నారు.
తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలా జరగలేదన్నారు. శంకుస్థాపన చేసినప్పుడే ప్రారంభోత్సవ తేదీని ప్రకటించానని గుర్తు చేశారు. పనిచేయని మంత్రులను ఇంటికి పంపిస్తామని పరోక్షంగా హెచ్చరించారు. 302 కిలోమీటర్ల లక్నో-ఆగ్రా ఎక్స్పెస్ కు ఆదివారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ములాయం తనయుడు అఖిలేష్ యాదవ్ కూడా పాల్గొన్నారు.