మన దేశాన్ని దేవుడే కాపాడాలి

మన దేశాన్ని దేవుడే కాపాడాలి - Sakshi


న్యూఢిల్లీ: శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ తన పట్ల అనుచితంగా ప్రవర్తించారని, అందరిముందు తనను తీవ్రంగా అవమానించి దాడికి పాల్పడ్డారని ఎయిరిండియా అధికారి సుకుమార్ చెప్పారు. ఎంపీ తన కళ్లజోడు పగలగొట్టారని, ఇలాంటి ఘటన జరుగుతుందని తాను ఎప్పుడూ ఊహించలేదని అన్నారు. మన ఎంపీల ప్రవర్తన, సంస్కృతి ఇదే అయితే మన దేశాన్ని దేవుడే రక్షించాలని సుకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.



గైక్వాడ్‌పై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని సుకుమార్ డిమాండ్ చేశారు. దాడి ఘటనకు సంబంధించి ఆయనపై ఫిర్యాదు చేశారు. సీటు విషయంపై ఎంపీ చెప్పిన విషయం సాధ్యంకాదని చెప్పానని, దీంతో ఎంపీ తనను అసభ్య పదజాలంతో తిట్టారని, చేయిచేసుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.  



గురువారం ఢిల్లీ విమానాశ్రయంలో సీటు విషయంపై సుకుమార్‌తో గొడవపడిన ఎంపీ గైక్వాడ్‌ చెప్పుతో ఆయన్ను కొట్టారు. ఈ విషయాన్ని ఎంపీ అంగీకరించారు. ఎంపీ దురుసు ప్రవర్తనపై సర్వత్రా విమర్శలు వచ్చాయి.  కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్‌ గజపతి రాజు ఈ ఘటనపై స్పందిస్తూ.. భౌతిక దాడులను ఏ పార్టీ కూడా ప్రోత్సహించదని, ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకూడదని అన్నారు. ఇలాంటి ఘటనలను శివసేన సహించదని ఆ పార్టీ నేత మనీషా కయండె చెప్పారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top