ఆర్ఎస్ఎస్ కీలక భేటీకి మోదీ!
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా ఆర్ఎస్ఎస్(రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్) కీలక సమావేశానికి నరేంద్ర మోదీ హాజరు కానున్నట్లు తెలిసింది. బుధవారం న్యూఢిల్లీలో ప్రారంభం కానున్న ఆర్ఎస్ఎస్ ద్వైవార్షిక సమన్వయ్ బైఠక్ లో మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పాల్గొంటారని ఆ సంస్థ ప్రతినిధులు మంగళవారం సూచన ప్రాయంగా వెల్లడించారు.
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్సహా 93 మంది కార్యనిర్వాహక సభ్యులు, 15 మంది అనుబంధసభ్యులు హాజరయ్యే బైఠక్లో పలు కీలక అంశాలను చర్చించనున్నట్లు తెలిసింది. తాజాగా కేంద్రప్రభుత్వం విడుదల చేసిన మత గణన వివరాల్లో హిందువుల జనాభా తగ్గిపోవడం, సైనికోద్యోగులకు ఒకే ర్యాంకు ఒకే పెన్షన్ విధానం, భూసేకరణ బిల్లు, బీహార్ ఎన్నికలు తదితర విషయాలు చర్చించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.
ఈ సారి జరగబోయే సమావేశం ఆర్ఎస్ఎస్ చరిత్రలోని అతి పెద్దదానిలో ఒకటని ఆ సంస్థ అధికార ప్రతినిధి మన్మోహన్ వైద్య అన్నారు. రాజకీయ అంశాలను చర్చిస్తారా? అన్న మీడియా ప్రశ్నకు సమాజంలోని అన్ని సమస్యలు చర్చకు వచ్చే అవకాశం ఉంటుందని బదులిచ్చారు.