ముగ్గురు అక్కాచెల్లెల్లపై దారుణం
బరేలి: ఉత్తరప్రదేశ్లో మరో దారుణ ఘటన జరిగింది. బరేలి జిల్లాలో సైజ్నా గ్రామంలో శుక్రవారం అదృశ్యమైన ముగ్గురు అక్కాచెల్లెల్లు శవాలై కనిపించారు. గ్రామానికి కొద్దదూరంలో భాక్రా నదిలో వీరి మృతదేహాలను గుర్తించారు. గ్రామానికి చెందిన కొందరు యువకులు వీరిపై అత్యాచారం చేసి, హత్య చేశారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు.
అన్నదమ్ముల సంతానమైన ముగ్గురు బాలికలు (13, 14, 15) శుక్రవారం సాయంత్రం ఆరుబయటకు వెళ్లారు. గంటసేపయినా వాళ్లు ఇంటికి తిరిగిరాకపోయే సరికి ఓ బాలిక (13) తల్లి గ్రామ పరిసరాల్లో గాలించింది. వారి జాఢ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులకు చెప్పింది. అందరూ కలసి చుట్టుపక్కల ప్రాంతాల్లో వెదికినా బాలికల ఆచూకీ లభ్యంకాలేదు. ఆ రోజు రాత్రి బాధితుల కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ మరుసటి రోజు శనివారం సమీపంలోని భాక్రా నదిలో ఓ బాలిక మృతదేహం కనిపించిందని గ్రామస్తుడు చెప్పడంతో బాధిత బాలికల కుటుంబ సభ్యులు వెళ్లారు. మృతదేహం తమ అమ్మాయిదేనని కుటుంబ సభ్యులు గుర్తించారు. నదిలో పోలీసులు గాలించగా మరో రెండు మృతదేహాలను వెలికితీశారు. ఆస్తి విషయంపై గ్రామంలో కొందరితో విబేధాలున్నాయని, వారే తమ కుమార్తెలను హత్య చేశారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు.