ట్విట్టర్ను మేం కొనం...

ట్విట్టర్ను మేం కొనం...

మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ అమ్మక వార్త గత కొన్ని నెలలుగా సంచలనం రేపుతోంది. ఈ విక్రయానికి సంబంధించి ఇప్పటికే పలు టెక్నాలజీ కంపెనీలతో ట్విట్టర్ సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది. రిపోర్టుల ప్రకారం గూగుల్, వెరిజోన్, మైక్రోసాప్ట్లు ట్విట్టర్ను చేజిక్కించుకోవడానికి పోటీ పడుతున్నట్టు సమాచారం. ఇవి త్వరలోనే బిడ్డింగ్ దాఖలు చేయనున్నాయని తెలిసింది.

 

కానీ ట్విట్టర్ను కొనుగోలు చేసే ఆలోచన నుంచి టెక్ దిగ్గజం మైక్రోసాప్ట్ తప్పుకుందట. త్వరలోనే దాఖలు చేయబోయే బిడ్డింగ్ను ఉపసంహరించుకున్నట్టు తెలుస్తోంది. మైక్రోసాప్ట్ ఇటీవలే లింక్డ్ఇన్ను 26.6 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. ఈ భారీ కొనుగోలుతో ట్విట్టర్ను సొంతం చేసుకోవడానికి మైక్రోసాప్ట్ ఆసక్తి చూపడం లేదని సమాచారం.

 

సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ట్విట్టర్కు ఫుల్ క్రేజ్ ఉంటోంది. సెలబ్రిటీల నుంచి సాధారణ ప్రజానీకం వరకు ట్విట్టర్నే ఫాలో అవుతారంటే ఎలాంటి సందేహమే లేదు. అలాంటి కంపెనీకి యూజర్ల వృద్ధి మందగించి, కోలుకోలేని ఆర్థిక నష్టాలను మూటకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో దీన్ని విక్రయించాలని కంపెనీ భావిస్తోంది. 

 

ట్విట్టర్ అమ్మక వార్తతో సెప్టెంబర్ 23వరకు ఆ కంపెనీ షేర్లు అంతర్జాతీయంగా 19 శాతం మేర జంప్ అయ్యాయి. 2013 తర్వాత ఒక్కరోజులో ఈమేర పెరగడం ఇదే మొదటిసారి. దీంతో ట్విట్టర్ మార్కెట్ విలువ16 బిలియన్ డాలర్లకు ఎగిసింది. తాజాగా ట్విట్టర్ కొనుగోలు నుంచి మైక్రోసాప్ట్ తప్పుకోవడంతో ఏ కంపెనీ దీన్ని చేజిక్కించుకుంటుందో వేచిచూడాలి.

 

 
Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top