సినిమా క్రైం స్టోరీని మించిపోయాడు!

సినిమా క్రైం స్టోరీని మించిపోయాడు!


సినిమాల్లో బ్యాడ్ పోలీసులు ఎలా చేస్తారో అచ్చం అలాగే చేశాడా భర్త. వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని.. కట్టుకున్న భార్యను కాల్చి చంపేసి, ఆ విషయం బయటపడకుండా ఉండేందుకు తన రెండు కాళ్ల మీద కూడా పిస్టల్‌తో కాల్చుకున్నాడు. దీంతో పోలీసులు కూడా మొదట్లో అంతా నిజమేననుకున్నారు. కానీ అనుకోకుండా అసలు విషయం తెలిసి ముక్కున వేలేసుకున్నారు. మీరట్- పరీక్షిత్‌గఢ్ రహదారిపై జరిగిన ఈ దారుణం నిజంగా ఎవరో చేసిందేననే అంతా అనుకున్నారు. తాను భార్యతో కలిసి వెళ్తుండగా ఎవరో దుండగులు వచ్చి కాల్పులు జరిపారని, దాంతో ఆమె మరణించిందని, తాను ప్రతిఘటించకుండా ఉండేందుకు తన కాళ్ల మీద కూడా కాల్చేశారని బిజేంద్ర సింగ్ (24) చెప్పాడు. కానీ చివరకు అతగాడి బాగోతం మొత్తం బయటపడింది.



పరీక్షిత్‌గఢ్ రోడ్డులో మీరట్ నగరానికి 28 కిలోమీటర్ల దూరంలో బహదూర్‌పూర్ గ్రామం వద్ద ఈ డ్రామా మొత్తం జరిగింది. బిజేంద్ర సింగ్ (24), అతడి భార్య రజనీసింగ్ (30)లపై కాల్పులు జరిగినట్లు పోలీసులకు సమాచారం అందింది. ఆమె అక్కడికక్కడే మరణించగా, బిజేంద్రను ఆనంద్‌లో ఉన్న ఓ ఆస్పత్రిలో చేర్చారు. అయితే.. దాని గురించిన వివరాలు అడిగినప్పుడు బిజేంద్ర భిన్న కథనాలు చెప్పడంతో పోలీసులకు అనుమానం మొదలైంది. గ్రామస్తులను విచారిస్తే ఇద్దరి మధ్య ఆరేళ్ల వయసు తేడా ఉందని, భార్యే పెద్దదని తెలిసింది. బిజేంద్రకు చాలామందితో సంబంధాలు ఉన్నా, రజని మాత్రం అతడిని పిచ్చిగా ప్రేమించేది. ఆరోజు బూడిద రంగు శాంత్రో కారు అక్కడ కనిపించిందని, దానికి ఢిల్లీ నంబర్ ప్లేటు ఉందని గ్రామస్తులు చెప్పారు. పోలీసులకు నాలుగు బూడిరంగు కార్లు కనిపించగా, వాటిలో ఒకదానికి ఢిల్లీ నంబర్ ఉంది. వెంటనే కారులో ఉన్న ముగ్గురు యువకులను పట్టుకున్నారు. వాళ్ల దగ్గర రెండు నాటు తుపాకులు, వాడిన లైవ్ కార్ట్రిడ్జులు దొరికాయి. వాళ్లను తమదైన శైలిలో ప్రశ్నిస్తే.. నాటకం అంతా బయటపడింది. వేరే మహిళ మోజులో పడిన బిజేంద్ర.. తన భార్యను అడ్డు తొలగించుకోవాలనే ఇలా చేసినట్లు చెప్పారు. ఇంత నాటకం ఉందని తెలిసిన పోలీసులు ముక్కున వేలేసుకుని.. బిజేంద్రను అదుపులోకి తీసుకున్నారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top