ప్రియురాలిని హతమార్చి.. ఆపై

ప్రియురాలిని హతమార్చి.. ఆపై - Sakshi


కేకే నగర్‌: వివాహానికి ఒప్పుకోకపోవడంతో ప్రియురాలిని హత్య చేసి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సోమవారం కరూర్‌లో జరిగింది. తిరువారూర్‌ జిల్లా పళయపాళెం ప్రాంతానికి చెందిన వినోద్‌ (27) ఇంజినీరింగ్‌ చదివి అగ్నిమాపక పరికరాలను సప్లై చేసే వ్యాపారం చేస్తున్నాడు. అతను కళాశాల్లో 3వ సంవత్సరం చదివే సమయంలో మొదటి సంవత్సరం చదువుతున్న షణ్ముగప్రియతో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం ప్రేమగా మారింది. సోమవారం సాయంత్రం కరూర్‌లోని షణ్ముగప్రియ ఇంటికి వినోద్‌ వెళ్లాడు. అక్కడ ఇద్దరు చాలాసేపు మాట్లాడుకున్నారు. కొద్దిసేపటి తరువాత షణ్ముగప్రియ తల్లి గౌరీశంకరి మార్కెట్‌ నుంచి ఇంటికి వచ్చి చూడగా షణ్ముగప్రియ చనిపోయి కనిపించింది. ఆమె సమీపంలో వినోద్‌ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని కనిపించాడు. దీంతో దిగ్భ్రాంతి చెందిన గౌరీశంకరి భయంతో పెద్దగా ఏడుస్తూ కేకలు పెట్టింది. స్థానికులు వెంటనే కరూర్‌ టౌన్‌ పోలీసులకు సమాచారం పంపారు.



పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరుపుగా.. షణ్ముగప్రియ గొంతును టవల్‌తో బిగించి హత్య చేసిన గుర్తులు కనిపించాయి. రెండు మృతదేహాలను పోస్టుమార్టం కోసం కరూర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి పంపారు. విచారణలో షణ్ముగప్రియకు చెన్నైలోని ప్రైవేటు సంస్థలో ఉద్యోగం వచ్చిందని, మరో వారంలో ఉద్యోగంలో చేరేందుకు ఉత్తర్వులందాయని తెలిసింది. అయితే ఆమె ఉద్యోగం చేయడం ఇష్టంలేని వినోద్‌ ఆమెకు వద్దని చెప్పాడని, అయితే కొన్నాళ్లు ఓపిక పట్టమని షణ్ముగప్రియ ఎంత చెప్పినా వినోద్‌ వినలేదని.. కోపంలో షణ్ముగప్రియ గొంతు నులిమి హత్య చేసి ఆ తర్వాత వినోద్‌ తానూ ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top