అదృష్టం: వరదలో అతనికేం దొరికిందో తెలుసా!
వర్షాలు పడితే.. నగర వాసులకు ఎన్ని కష్టాలు ముంచుకొస్తాయో ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. వానలు రావడంతోనే రోడ్ల మీద గుంతలు, వాటినిండా నీళ్లు పలుకరిస్తాయ్. లోతట్టు ప్రాంతాలు మునిగితాయ్. ట్రాఫిక్ సంగతి సరే సరి.. ఒకవైపు వర్షం కురుస్తున్నా.. మరోవైపు వాహనాలు కదలనే కదలవు. ఇన్ని కష్టాలుంటాయనే నగరవాసులు అనగానే బెంబేలెత్తిపోతారు.
కానీ, అంతటి కష్టాలలో ఓ వ్యక్తిని అదృష్టం వరించింది. అసలు విషయమేమిటంటే.. ఊరించి.. ఊరించి ఇటీవలే ముంబై మహానగరాన్ని ఎట్టకేలకు వానలు పలుకరించాయి. సోమవారం భారీగా కురిసిన వానలతో పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు మునిగితాయి. అయితే, వానలు పడ్డా ముంబైలో వింతలకు కొదవ లేదు. అలాంటి ఘటనే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముంబైలోని కందివ్లీ ప్రాంతంలో నిలిచిపోయిన వరదనీటిలో ఓ వ్యక్తిని అదృష్టం వరించింది. రోడ్డు మీద ఆగిన నీటిలో అతనికి ఓ పెద్ద చేప దొరికింది. వానకు తడుస్తూ అతడు చేపను పట్టుకున్న ఫొటోలు దినపత్రికల్లో, సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ముంచెత్తిన వానలో ఫిష్కర్రీకి సరిపడా చేప దొరకడం ఎవరికి మాత్రం ఆనందం కాదు అంటున్నారు నెటిజన్లు.