మలేషియా విమాన ఘటనలో కుట్రకోణం?


మలేషియా నుంచి బెంగళూరు వెళ్లాల్సిన విమానాన్ని ఉన్నట్టుండి ఎందుకు ఎమర్జెన్సీ లాండింగ్ చేయాల్సి వచ్చింది? 166 మందితో వెళ్తున్న ఆ విమానాన్ని కిందకు దింపడం వెనుక ఏమైనా కుట్రకోణం ఉందా? ఈ అనుమానాలన్నీ ఇప్పుడు మలేషియా పోలీసులకు వచ్చాయి. అందుకే వాళ్లు ఈ కోణంలో దర్యాప్తు మొదలుపెట్టారు. టైరు పేలిపోవడం, ల్యాండింగ్ గేర్ పనిచేయకపోవడంతో మలేషియా ఎయిర్లైన్స్కు చెందిన ఎంహెచ్192 విమానాన్ని అత్యవసరంగా దించేసిన విషయం తెలిసిందే. విమానం బయల్దేరేసరికి అందులో ఎవరైనా కుట్రదారులు ఉన్నారేమో దర్యాప్తు చేస్తున్నట్లు ఐజీపీ ఖాలిద్ అబూ బకర్ తెలిపారు. ఈ విషయమై మలేషియా రవాణా శాఖ మంత్రి హిషాముద్దీన్ హుస్సేన్ ఫోన్ చేసి అడగడంతో ఈ విషయం తెలిపారు.



159 మంది ప్రయాణికులు, ఏడుగురు సిబ్బందితో కౌలాలంపూర్ నుంచి బెంగళూరు వెళ్తున్న బోయింగ్ 737-800 విమానాన్ని అత్యవసరంగా దించారు. టేకాఫ్ తీసుకునే సమయంలో కుడివైపు ఒక టైరు పేలిపోవడం, ప్రధాన ల్యాండింగ్ గేర్ పనిచేయకపోవడం వల్లే ఇలా దించాల్సి వచ్చిందని మలేషియా ఎయిర్లైన్స్ ఓ ప్రకటనలో తెలిపింది. టైరుకు సంబంధించిన కొన్ని ముక్కలు రన్వే మీద కనపడటంతో ఏటీసీ నుంచి విమాన కెప్టెన్కు హెచ్చరిక సందేశం వెళ్లింది. భద్రత దృష్ట్యా వెంటనే విమానాన్ని వెనక్కి తిప్పాల్సి వచ్చిందని అంటున్నారు. విమానం వెనక్కి రాగానే మొత్తం 159 మంది ప్రయాణికులు, ఏడుగురు సిబ్బంది దిగిపోయారు. ఈ విమానం మళ్లీ మధ్యాహ్నం 3.30 గంటలకు కౌలాలంపూర్ నుంచి బయల్దేరి సాయంత్రం 5 గంటలకు బెంగళూరు వస్తుంది.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top