నాన్ స్టాప్ విమానంలో సీట్లన్నీ ఫుల్
న్యూఢిల్లీ: ఇండియా నుంచి సిలికాన్ వ్యాలీకి మొట్టమొదటసారిగా వెళ్లనున్న నాన్ స్టాప్ విమానంలో ప్రయాణించేందుకు ప్రయాణికులు అమితాసక్తితో ఎదురు చూస్తున్నారు. న్యూఢిల్లీ నుంచి శాన్ ఫ్రాన్సిస్కోకు నేరుగా వెళ్లనున్న ఈ విమానంలో సీట్లు అన్నీ దాదాపు బుక్ అయ్యాయి. 238 సీట్లలో 98 శాతంపైగా బుక్ అయ్యాయని ఎయిర్ ఇండియా అధికార వర్గాలు వెల్లడించాయి.
ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఈ నాన్ స్టాప్ విమానం బుధవారం శాన్ ఫ్రాన్సిస్కోకు బయలుదేరనుంది. ఇందులో ప్రయాణించేందుకు బెంగళూరుతో సహా ఏడు ప్రధాన నగరాల నుంచి టిక్కెట్లు బుక్ చేసుకున్నారు. వీరందరినీ మంగళవారం రాత్రి బెంగళూరు నుంచి చిన్న విమానంలో ఢిల్లీకి తీసుకొస్తామని, బుధవారం తెల్లవారుజామున ఢిల్లీ నుంచి శాన్ ఫ్రాన్సిస్కోకు వెళ్లే డైరెక్ట్ ఫ్లైట్ లో వీరిని ఎక్కిస్తామని ఎయిర్ ఇండియా అధికార ప్రతినిధి వి. చంద్రశేఖర్ తెలిపారు.
న్యూఢిల్లీ- శాన్ ఫ్రాన్సిస్కో డైరెక్ట్ విమానం ఏఐ-173ను వారానికి మూడుసార్లు(బుధ, శుక్ర, ఆదివారాలు) నడపనున్నారు. శాన్ ఫ్రాన్సిస్కో నుంచి గురు, శని, సోమవారాల్లో ఢిల్లీకి ఈ విమానం బయలుదేరుతుంది.
సంబంధిత వార్తలు