జయలలిత 'కొడుకు'ను అరెస్టు చేయండి
-
నకిలీ పత్రాలు సమర్పించడంపై ఆగ్రహం -
కృష్ణమూర్తి అరెస్టుకు మద్రాస్ హైకోర్టు ఆదేశం
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత కొడుకునంటూ ముందుకు వచ్చిన జే కృష్ణమూర్తి అనే వ్యక్తిని అరెస్టు చేయాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. తాను జయలలిత కొడుకును అంటూ అతడు సమర్పించిన ధ్రువపత్రాలన్నీ నకిలీవేనని పోలీసులు స్పష్టం చేయడంతో ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది.
తాను జయలలిత, నటుడు శోభన్ బాబులకు జన్మించానని, ఆమె ఆస్తులకు తానే వారసుడినని ఈరోడ్కు చెందిన కృష్ణమూర్తి హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ నుంచి తనకు ప్రాణహాని ఉందని, తనకు రక్షణ కల్పించడంతో పాటు జయలలిత ఆస్తులన్నింటినీ తనకు అప్పగించాల్సిందిగా అతను కోరాడు. అయితే, అతని పిటిషన్ను విచారణకు స్వీకరించిన హైకోర్టు గత శుక్రవారం విచారణ సందర్భంగా తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
'ఫిర్యాదుదారుడు సమర్పించిన డాక్యుమెంట్లను ఎల్కేజీ విద్యార్థి ముందు ఉంచినా, ఆ పిల్లాడు వీటిని తప్పుడు పత్రాలని చెబుతాడు. అందుబాటులో ఉన్న ప్రముఖుల ఫొటోను వాటిపై అతికించాడు. అతను తప్పుడు పత్రాలు సృష్టించాడు. కోర్టుతో ఆటలు వద్దు' అని జస్టిస్ మహదేవన్ గత విచారణ సందర్భంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం చెన్నై పోలీస్ కమిషనర్ ఎదుట కృష్ణమూర్తిని హాజరు పరచి, అతని ఒరిజనల్ డాక్యుమెంట్లను పరిశీలించాలని పోలీసులను ఆదేశించారు. కృష్ణమూర్తికి మద్దతుగా కోర్టుకు వచ్చిన సామాజిక కార్యకర్త ట్రాఫిక్ రామస్వామిని సైతం న్యాయమూర్తి మందలించారు. ఈ నేపథ్యంలో తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించాడని తేలడంతో కృష్ణమూర్తి అరెస్టుకు కోర్టు ఆదేశాలు ఇచ్చింది.
1985లో తాను జయలలితకు జన్మించానని, ఆ మరుసటి సంవత్సరం తనను ఈరోడ్కు చెందిన వసంతమణికి దత్తత ఇచ్చారని కృష్ణమూర్తి ఫిర్యాదులో పేర్కొన్నాడు. దత్తత పత్రంపై జయలలిత, శోభన్ బాబు, వసంతమణి ఫొటోలు, సంతకాలు ఉన్నాయని, మాజీ ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్ సాక్షిగా సంతకం చేశారని వెల్లడించాడు. గతేడాది డిసెంబర్ 5న చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జయలలిత మరణించిన సంగతి తెలిసిందే.