యూఎస్లో జాబ్కు గుడ్ బై చెప్పి మరీ ...

యూఎస్లో జాబ్కు గుడ్ బై చెప్పి మరీ ... - Sakshi


లక్నో :  ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేస్తామని చెప్పామంటే.. ఎవరైనా మనవైపు వెర్రిగా చూస్తారు. అదే అమెరికా ప్రభుత్వంలో పెద్ద ఉద్యోగం... దానికి రాజీనామా చేస్తామంటే బంధువులు, స్నేహితులు మనవైపు ఎలా చూస్తారో ఓ సారి ఊహించుకోండి. ఉత్తరప్రదేశ్ లక్నోకి చెందిన నిహారికా భట్ యూఎస్లో ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి... భారత్ వచ్చేసి... సివిల్స్ సర్వీసెస్ పరీక్ష పై దృష్టి పెట్టింది. తొలి ప్రయత్నంలోనే ఈ పరీక్షలు రాసి 146 ర్యాంకు సాధించింది.



లక్నో ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో ఎలక్ట్రానిక్ అండ్ ఇన్స్ట్రిమెంటేషన్ విభాగంలో నిహారిక ఇంజనీరింగ్ పట్టా అందుకుంది. అనంతరం యూఎస్ వెళ్లింది. ఆక్కడ మిచిగాన్ యూనివర్శిటీలో ఎమ్టెక్ చేస్తూనే యూఎస్ ప్రభుత్వ సంస్థ  ఫూడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్డీఏ) విభాగంలో పరిశోధకురాలిగా చేరింది. అక్కడ దాదాపు ఏడాదిన్నర పాటు మానవుని ఆర్యోగంపై నానో పార్టికల్స్ ప్రభావం అన్న అంశంపై నిహారిక పరిశోధనలు చేసింది. అయినా దేశ సేవకు ఏదో చేయాలనే తలంపుతో అక్కడి నుంచి వచ్చి సివిల్స్ పై దృష్టి పెట్టింది. మొదటి ప్రయత్నంలోనే నిహారిక అనుకున్నది సాధించింది.


ఆమె తండ్రి లక్నోలో వైద్యునిగా విధులు నిర్వర్తిస్తుంటే.. తల్లి మాత్రం సాధారణ గృహిణి అని నిహారిక తెలిపింది. సివిల్స్ సర్వీసెస్ ఇంటర్వ్యూలో యూఎస్లో ప్రభుత్వ ఉద్యోగానికి ఎందుకు రాజీనామా చేసి సివిల్స్ ఎంచుకున్నావని యూపీఎస్సీ సభ్యులు తనను అడిగారని 146వ ర్యాంకు సాధించిన నిహారిక ఆనందంతో చెప్పింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని టాపర్ గా నిలిచినందుకు నిహారిక సంతోషంతో ఉబ్బితబ్బిబవుతుంది.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top