ఎక్కడుందీ లాంజుంగ్?
హిమాలయాల నడుమ అందంగా అమర్చినట్లున్న చిన్న దేశం.. నేపాల్. అందులోనూ ప్రకృతి సౌందర్యానికి పట్టుగొమ్మగా ఉండే నగరం.. లాంజుంగ్. ఒక్క దేశంలోనే దాదాపు 876 మంది ప్రాణాలు కోల్పోవడానికి కారణమైన భూకంపం పుట్టింది ఆ నగరంలోనే!! ఎక్కడో భూమికి 10 కిలోమీటర్ల లోతున పుట్టిన ఈ పెను భూకంపం అక్కడినుంచి ఎక్కడెక్కడికో వ్యాపించింది. రిక్టర్ స్కేలుపై 8.1 తీవ్రతను నమోదు చేసింది. ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించిన మృతుల సంఖ్య 876 మాత్రమే. కానీ నిలువునా కుప్పకూలిన భవనాల శిథిలాల కింద, ఆలయాల శిఖరాల కింద మరెంతమంది అభాగ్యులు నిర్జీవులుగా పడి ఉన్నారో తెలియదు. అలాగే.. మారుమూల ప్రాంతాల్లోని పల్లెల్లో ఎక్కడెక్కడ ఎంతెంత మంది మరణించారన్న లెక్కలు కూడా ఇంకా ఎవరికీ అందలేదు.
భవనాలు కూలిపోయాయి, రోడ్లు చీలిపోయాయి, ఫోన్ లైన్లు మూగబోయాయి, ఇంటర్నెట్ ఆగిపోయింది.. మొత్తమ్మీద జనజీవనమే ఒక్కసారిగా స్తంభించిపోయింది. నేపాల్ రాజధాని ఖాట్మాండుకు 75 కిలోమీటర్ల నైరుతి దిశగా ఉన్న లాంజుంగ్ జిల్లా మొత్తం జనాభా కలిపినా 1.80 లక్షలు మాత్రమే. ఈ జిల్లా కేంద్రమైన బేసిశహర్ నగరంపై ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. 1700 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్న ఈ జిల్లాలో వ్యవసాయమే ప్రధాన జీవనాధారం.