కార్లపై ఎర్రబుగ్గ ఎవరు వాడకూడదో చెప్పండి
- పిటిషనర్ను కోరిన హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: కార్లపై ఎర్రబుగ్గ, సైరన్ను ఏయే హోదాల్లోని వ్యక్తులు ఉపయోగించరాదో చెప్పాలని పిటిషనర్ను, రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు కోరింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ తెల్లప్రోలు రజనీల ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
కార్లపై ఎరుపు, నీలం రంగుల బుగ్గలు, సైరన్ల వినియోగంపై ఆంక్షలు ఉన్నప్పటికీ కొందరు ప్రజా ప్రతినిధులు దర్పం ప్రదర్శించేందుకు సైరన్ను వినియోగిస్తున్నారని, ఈ విషయంలో కేంద్ర నిబంధనలను అమలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ మహబూబ్నగర్ జిల్లా రుద్రారం గ్రామానికి చెందిన న్యాయవాది భావనప్ప హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే.
ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం వ్యాజ్యంపై విచారణ జరపగా పిటిషనర్ తరఫు న్యాయవాది తేరా రజనీకాంత్రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఎర్రబుగ్గలు, సైరన్ల వినియోగంపై నిషేధం, ఆంక్షలు ఉన్నా అమలవడం లేదన్నారు. కొందరు నేతలు బహిరంగ ప్రదేశాల్లో, టోల్ గేట్ల వద్ద ఇష్టమొచ్చినట్లు సైరన్లను వాడుతున్నారని చెప్పారు. ధర్మాసనం స్పందిస్తూ.. ఏయే కేటగిరీ వ్యక్తులు సైరన్ను ఉపయోగించరాదో చెప్పాలని పిటిషనర్, రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.