కేజీ టు పీజీ విద్య ఏమైంది?
పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు భట్టి
సాక్షి, హైదరాబాద్: కేజీ నుంచి పీజీ దాకా ఉచిత విద్యను అమలుచేస్తామని ఇచ్చిన హామీ ఏమైందని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గాంధీభవన్లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రైవేటు కాలేజీలకు ఫీజు కట్టలేక విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేటు కాలేజీలో ఫీజు కట్టలేక కరీంనగర్ జిల్లాకు చెందిన సంతోశ్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు.
ఈ విద్యార్థి ఆత్మహత్యతోనైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరవాలని భట్టి సూచించారు. విద్యాహక్కు చట్టాన్నైనా కఠినంగా అమలుచేయాలని భట్టి కోరారు. ప్రైవేటు కాలేజీల ధన దోపిడీపై ప్రభుత్వం కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలుచేయాలని భట్టి డిమాండ్ చేశారు. రైతుల ఆత్మహత్యలకు ప్రభుత్వ వైఖరే కారణమన్నారు. రుణమాఫీపై అసెంబ్లీలో సమాధానం చెప్పకుండా ప్రభుత్వం పారిపోతున్నదని విమర్శించారు.